మరో వివాదంలో చింతమనేని: అర్ధరాత్రి అభయారణ్యంలో రోడ్డేశారు, అటవీశాఖ సిబ్బందిపై దాడి
కృష్ణా: దెందులూరు ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలు వ్యతిరేకించి కొల్లేరు అభయారణ్యంలో రాత్రి రాత్రి రహదారి నిర్మాణం చేశారు.
శుక్రవారం అర్ధరాత్రి కృష్ణా జిల్లా ఆటపాక పక్షుల అభయారణ్యంలో తన నియోజకవర్గంలోని గ్రామమైన కోమటిలంకకు సుమారు కిలోమీటరు పొడవున రహదారి నిర్మాణం చేపట్టారు. అడ్డువచ్చిన అటవీ శాఖ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు.
అంతేగాక, ఎమ్మెల్యే అనుచరులు అటవీశాఖ సిబ్బంది దాడి చేశారు. అవసరమైతే కేసులు నమోదు చేసుకోమంటూ బెదిరించారు. దీనిపై డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కే.ఈశ్వరరావు కైకలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు చింతమనేనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గతంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ మహిళా ఎమ్మెల్యేపైనా చింతమనేని ప్రభాకర్ దురుసుగా ప్రవర్తించారు. ఆయన అనుచరులు మహిళ అని కూడా చూడకుండా ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీనిపై ఆమె ఫిర్యాదు మేరకు చింతమనేనిపై కేసు నమోదైంది. కాగా, ఇప్పుడు అభయారణ్యంలో రోడ్డు నిర్మాణం చేసి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు చింతమనేని.