‘మొదటి ముద్దాయి చిరంజీవి! పవన్కు రక్తసంబంధం అడ్డొస్తుందా?’: చింతమనేని తీవ్ర విమర్శలు
పశ్చిమగోదావరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ నేత చిరంజీవిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ కోసం కాపు సోదరులు ఆస్తులు అమ్మి మద్దతు ఇస్తే.. వాళ్లను బలి పశువును చేసింది చిరంజీవేనని దుయ్యబట్టారు.
ఆ ఘనత చిరంజీవిదే
ఏలూరు మండలం మాదేపల్లి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు చింతమనేని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని బంగాళాఖాతంలో కలిపిన ఘనత చిరంజీవిదేనని విమర్శించారు.
చిరంజీవే మొదటి ముద్దాయి..
ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి మొదటి ముద్దాయి చిరంజీవే అని ఆరోపించారు. ‘మీ అన్న చిరంజీవి ఇంత ద్రోహం చేస్తే ఎందుకు అడగలేక పోతున్నావు' అని పవన్ను చింతమనేని ప్రశ్నించారు.
పవన్! రక్త సంబంధం అడ్డొస్తుందా?
చిరంజీవిని ప్రశ్నించడానికి రక్తసంబంధం అడ్డొస్తుందా? అని నిలదీశారు. ‘అలాంటివాడివి ప్రజారాజ్యం పార్టీని నడిపించలేకపోయావా?, జనసేన పార్టీ ఎందుకు పెట్టావు' అని వ్యాఖ్యానించారు.
నన్ను ఓడించడం అంత సులువు కావు
‘పవన్ కళ్యాణ్ నీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. నన్ను ఓడించి, జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని ఊగిపోతున్నారు.. మీరు కాదు మీ జేజేమ్మలు దిగొచ్చినా నన్ను ఓడించలేరు' అని చింతమనేని ప్రభాకర్ అన్నారు.