లంచాలిస్తే ఏమైనా చేసుకోవచ్చు: అధికారులపై చింతమనేని సంచలనం
ఏలూరు: కోమటిలంకకు రోడ్డు వేయడం నేరం కాదని, పాత రోడ్డుపై గ్రావెల్ మాత్రమే పోశామని ప్రభుత్వ ఛీప్ విప్, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అటవీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
మూడో కాంటూరుకు తగ్గించాలనే డిమాండ్ ఉందని, ఆ హామీని నెరవేర్చి తీరుతామని ఆయన అన్నారు. అధికారులకు లంచాలు ఇస్తే, రోడ్లు వేసుకోవచ్చు, బంగళాలు కట్టుకోవచ్చు, లేదంటే నిబంధనల పేరుతో అడ్డుకుంటారని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
చింతమనేని ప్రభాకర్పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలోని కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం నుంచి పశ్చిమగోదావరి జిల్లా కోమటివానిలంకకు శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు నిర్మాణాన్ని జరిపించిన సంఘటన నేపథ్యంలో ఆ కేసులు నమోదయ్యాయి.
అంతేగాక ఇదే విషయాన్ని అటవీ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోగా పోలీసులు కిమ్మనకుండా ఉండిపోయారు. దీంతో ఆగ్రహించిన అటవీ సిబ్బంది పోలీస్స్టేషన్ వద్ద ధర్నా చేయాలని కూడా నిర్ణయించారు.
దీంతో ఎట్టకేలకు ఎమ్మెల్యే చింతమనేనిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అటవీశాఖ సిబ్బందిపై దౌర్జన్యం చేసినందుకుగానూ 353, 447 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.