నన్నే గుర్తుపట్టరా : టోల్ గేట్ సిబ్బంది పై చిందులు : కారు వదిలేసి బస్సులో
వివాదాలకు మారు పేరైన ఆయన మరోసారి వార్తల్లో కెక్కారు. కారుకు నంబర్ లేదు. స్టిక్కర్ లేదు. ముఖానికి మంకీ క్యాపు. ఎవరూ గుర్తు పట్టలేదు. నన్నే గుర్తు పట్టరా అంటూ చిందులు వేసారు. చివరికి తన కారు వదిలేసి కుటుంబ సభ్యులతో కలిసి బస్సు ఎక్కి వెళ్లిపోయారు. ఈ ప్రముఖుడు చేసిన హడావుడి ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
విప్ చింతమనేని మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే చింతమనేని ప్రభాకర్ ఈ సారి విచిత్ర వాదన చేస్తున్నారు. విప్ చింతమనేని ప్రభాకర్ కారు లో కాజా టోల్గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ తన కారును టోల్ గేట్ సిబ్బంది ఆపటంతో ఇక..చింతమనేని తన సహజ శైలిలో స్పందించారు. ఆయన కారుకు నెంబర్ ప్లేట్ లేదు..ఎమ్మెల్యే పాస్ సైతం లేదు. అవి లేకుండానే టోల్ గేట్ నుండి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది చింతమనేని అడ్డుకున్నారు. చింతమనేని వారితో వాగ్వాదానికి దిగారు.
సిబ్బంది సైతం వెనక్కు తగ్గకపోవటంతో..అక్కడే కారు వదిలేసి బస్సుల్లో చింతమనేని వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చింతమనేనితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ.. తన కారును అక్కడి నుంచి ఎలా తెప్పించుకోవాలో తెలుసంటూ చింతమనేని వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది.
దీని పై టోల్గేట్ సిబ్బంది స్పందించారు. చింతమనేనిని తాము గుర్తించలేదని..ఆయన తాను ఎమ్మెల్యే అనే విషయా న్ని సరిగ్గా చెప్పలదేని చెబుతున్నారు. ఎమ్మెల్యే అని తెలిసిన తరువాత వదిలేసామని..అయినా..ఆయన కారును అక్కడే వదిలేసి బస్సులో వెళ్లిపోయారని సిబ్బంది వివరించారు.