ఆసక్తికరం: వైసీపీ కార్యకర్తలకు చింతమనేని చాక్లెట్లు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకొంది. టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైసీపీ కార్యకర్తలకు చాక్లెట్లను పంచారు. ఎవరి కార్యక్రమాలు వారివేనని చింతమనేని వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర ఏలూరు రూరల్ మండలంలోని లింగాలగూడెంకు చేరుకొంది. అయితే అదే సమయంలో టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వెళ్తుండగా జగన్ పాదయాత్ర అడ్డుగా వచ్చింది.
దీంతో జగన్ పాదయాత్ర కారణంగా చింతమనేని ప్రభాకర్ కాన్వాయ్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.
చింతమనేని కారులో ఉండగా ఆయనతో కొందరు వైసీపీ కార్యకర్తలు మాట్లాడారు. జగన్ పాదయాత్రను చూసేందుకు వచ్చిన వైసీపీ శ్రేణులకు చింతమనేని ప్రభాకర్ చాక్లెట్లు ఇచ్చారు.
Recommended Video
ఎవరి కార్యక్రమాలు వారివేనంటూ చింతమనేని ప్రభాకర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరో వైపు పోలీసులు భారీ బందోబస్తు మధ్య చింతమనేని ప్రభాకర్ కాన్వాయ్ ను అక్కడి నుండి పంపించివేశారు.