వైసిపి మహిళా నేతతో చింతమనేని వాగ్వాదం, బాబుకు కేంద్రమంత్రి కితాబు
ఏలూరు: తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీలక్ష్మిల మధ్య శుక్రవారం నాడు తీవ్ర వాగ్వాదం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రులో ఆక్రమణలు కూల్చి వేసే విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.
చాటపర్రులో ఆక్రమణలు కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారు. వారిని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారికి వైసిపి మహిళా నేత శ్రీలక్ష్మి మద్దతుగా నిలిచారు.
అదే సమయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థానికులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరి పైన మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
చంద్రబాబు-పీయూష్ గోయల్ పరస్పరం ప్రశంసలు
ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్లు గురువారం నాడు ఒకరి పైన మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. విద్యుత్ సరఫరా నష్టాలను నివారించడంలో ఏపీ అంతర్జాతీయ ప్రమాణాలతో పని చేస్తోందని పీయూష్ కితాబిచ్చారు. దేశంలో తొలిసారి ఏపీలో వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.
ఈ మీటర్ల ద్వారా విద్యుత్ చౌర్యం అదుపులోకి వస్తుందని, విద్యుత్ పంపిణీ, సరఫరా, బిల్డింగ్ ఆదా అవుతుందన్నారు. వీటి ఖర్చును కేంద్రమే భరిస్తుందన్నారు. దేశంలో వంద శాతం విద్యుత్ కనెక్షన్లను అందించిన మూడో రాష్ట్రం ఏపీ అన్నారు. ఇప్పటి వరకు గుజరాత్, పంజాబ్ మాత్రమే వందశాతం విద్యుధీకరణ సాధించాయన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. పీయూష్ గోయల్ కేంద్రమంత్రి అయ్యాక దేశం విద్యుత్ రంగంలో పురోగమిస్తోందన్నారు. తీవ్రమైన విద్యుత్ కోత నుంచి మిగులు విద్యుత్ సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు.