యరపతినేని బాటలో చింతమనేని ... కేసుల భయంతో అజ్ఞాతంలోకి ...
ఏపీలో టీడీపీ నేతల మెడకు ఉచ్చు బిగుస్తోంది . కోడెల ఇప్పటికే పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయి ఉంటే యరపతినేని, కూన రవి కుమార్ అజ్ఞాతంలోకి వెళ్ళారు ఇక తాజాగా యరపతినేని బాటలో చింతమనేని కూడా సాగుతున్నారు. చింతమనేనిపై కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్ళారు.
ఇసుక రవాణా టెండర్లు రద్దు చేస్తూ జగన్ సంచలన నిర్ణయం .. రీజన్ ఇదే
చింతమనేని పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు.. అజ్ఞాతంలో చింతమనేని
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. చింతమనేని పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కావడంతో అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. చింతమేనేని పినకడిమి శివారులో ఎడ్లబళ్లపై ఇసుక తీసుకువెళుతున్న దళితులను అడ్డుకుని ,వారిని కులం పేరుతో దూషించారని దళితులు నిన్న ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో వైసీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఇక ఇక్కడ దళితులు చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మద్దతునిచ్చారు.
చింతమనేనిని పట్టుకోవటం కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీస్ బృందాలు
ఇక చింతమనేనిపై దళితులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు పెట్టటంతో ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ విచారణ చేపట్టారు. ఈ కేసులో చింతమనేనిని అరెస్ట్ చెయ్యాలని పోలీసులు చూస్తున్నారు. చింతమనేనితో పాటు ఆయన అనుచరులపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తనను కులం పేరుతో దూషించారని పెదవేగి పోలీస్ స్టేషన్ లో జోసెఫ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. చింతమనేనిపై ఇది రెండో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అలాగే తనను చింతమనేని, ఆయన అనుచరులు కొట్టారని రాచేటి జాన్ అనే హమాలీ నాయకుడు గతంలో ఫిర్యాదు చేశాడు. ఇక ఈ కేసుల నేపధ్యంలో చింతమనేనిని పట్టుకోవటం కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి.
కక్షపూరిత కేసులు .. వైసీపీ కుట్ర అంటున్న చింతమనేని
అయితే తనపై నమోదైన కేసు విషయంలో చింతమనేని స్పందించారు. తనపై కక్షపూరితంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. టీడీపీ ధర్నాలతో ప్రభుత్వానికి భయం పట్టుకుందని ఆరోపిస్తున్న ఆయన కావాలనే టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఇక యరపతినేని ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. యరపతినేని అక్రమ మైనింగ్ కేసులో ఆయన మెడకు సీబీఐ దర్యాప్తు పేరుతో ఉచ్చు బిగుస్తున్న నేపధ్యంలో యరపతినేని అజ్ఞాతంలోకి వెళ్లాడు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించారనే ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ సైతం అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇక ఇప్పుడు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని అజ్ఞాతంలో ఉన్నారు.