తెలంగాణ పోలీసుల వేట - పరారీలో చింతమనేని: 70 మందితో కలిసి..!!
టీడీపీ నేత..మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో సారి వివాదాస్పదంగా మారారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన ఈ సారి తెలంగాణ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తూ పోలీసుల ఉచ్చు నుంచి తప్పించుకున్నారు. సంగారెడ్డి జిల్లా చినకంజర్ల శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పటాన్ చెరు పోలీసులు దాడులు చేసారు. ఆ సమయంలో అక్కడ 70 మంది ఉండగా.. 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడకు వెళ్లిన పోలీసులు 21 మందిని పట్టుకొని రూ.13 లక్షల నగదు, 26 వాహనాలు, 27 సెల్ ఫోన్లు, 30 కత్తులు, 30 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
అయితే, కోడిపందేల నిర్వహణ వెనుక టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేనితో పాటుగా మరి కొందరరిని పోలీసులు గుర్తించారు. ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అక్కినేని సతీశ్, కృష్ణంరాజు, శ్రీనులు బృందంగా ఏర్పడి పందేలు ఆడుతున్నారని డీఎస్పీ తెలిపారు. తమ దాడుల సమయంలో చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజులు పరారయ్యారని.. అక్కినేని సతీశ్, బర్ల శ్రీనులు అదుపులో ఉన్నారని పటాన్చెరు డీఎస్పీ బీమ్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో చింతమనేని కి సంబంధించి పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
టీడీపీ హయాంలో ఎమ్మార్వో వనజాక్షి తో అనుచిత ప్రవర్తన రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. దీని పైన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చింతమనేని పైన అనేక కేసులు నమోదయ్యాయి. ఇక, చింతమనేని సైతం తాజాగా కోర్టులో ఒక ఫిర్యాదు దాఖలు చేసారు. ఇప్పుడు.. తెలంగాణలో చింతమనేని కోడి పందేలు నిర్వహణ.. పోలీసుల దాడులు.. చింతమనేని పరార్ వ్యవహారం ఇప్పుడు మరోసారి చర్చకు కారణమైంది.