మేయర్ అనురాధ హత్య: రూ.కోట్లు సంపాదించిన చింటూ, ఆస్తులు సీజ్!
చిత్తూరు: చిత్తూరు నగర మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్కు చెందిన అస్తులను ఈడీ (ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్) అధికారులు మంగళవారం నాడు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.
గత ఏడాది నవంబర్ 17వ తేదీన మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో చింటూను ప్రదాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో చింటూ అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినట్లు గుర్తించారు.
పలు బ్యాంకుల్లో చింటూ పేరుతో ఉన్న నగదు, అతడి తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం, సక్కుబాయి పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాలను సైతం పోలీసులు సీజ్ చేశారు. అలాగే బంగారుపాళ్యం వద్ద ఉన్న క్వారీ, ఇతర ఆస్తులు, భవనాలతో పాటు మిట్టూరులోని విద్యా సంస్థల భవనానికి చెందిన ఒరిజినల్ డాక్యుమెంట్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.