చీరాల ఎమ్మెల్యే ఆమంచి కీలక వ్యాఖ్యలు, రంగంలోకి చంద్రబాబు: ఆ తర్వాత నిర్ణయం
చీరాల: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఈ రోజు (బుధవారం) తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. 2014లో స్వతంత్రంగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ, జనసేనల వైపు చూస్తున్నారు.
మా కులం అది మాత్రమే: డీఎస్పీ పదోన్నతులపై జగన్కు డీజీపీ దిమ్మతిరిగే కౌంటర్
చంద్రబాబుతో భేటీ తర్వాత నిర్ణయం
ఈ నేపథ్యంలో చంద్రబాబు రంగంలోకి దిగి, మంత్రి శిద్ధా రాఘవ రావు ద్వారా బుజ్జగించారు. కానీ ఆయన ససేమీరా అన్నారు. తనకు అవమానం జరిగిందని చెప్పారు. అనంతరం బుధవారం చంద్రబాబు, లోకేష్లు ఆయనకు ఫోన్ చేశారని తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం తనను కలవాలని చంద్రబాబు.. ఆమంచికి సూచించారు. దీంతో ఆమంచి ఆ భేటీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అయితే మంత్రి నారా లోకేష్ ఫోన్కు సరిగా స్పందించలేదని తెలుస్తోంది.
13న వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం
పార్టీలో తాను ఇమడలేనని, పార్టీ తనను ఇబ్బందులకు గురి చేస్తోందని మంగళవారం శిద్ధాతో, తన అనుచరులతో ఆమంచి చెప్పారని తెలుస్తోంది. వైసీపీ నుంచి తనకు ఆహ్వానం ఉందని చెప్పారు. ఇరవై నెలల క్రితం పోతుల సునీతకు ఎమ్మెల్సి ఇచ్చిన సమయంలోనే తాను ఆవేదనకు లోనయ్యానని, ఇప్పుడు ఆమెను పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా చేయడంతో మరింత అసంతృప్తికి లోనైనట్లు చెప్పారు. ఈ నెల 13వ తేదీన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు.
అనుచరులతో కీలక వ్యాఖ్యలు
తన అనుచరులతో భేటీ సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. టీడీపీలో చేరినప్పటి నుంచి తన అభిప్రాయాలకు విలువ లేదని, సునీతకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా తనపై పెత్తానికి వదిలారని చెప్పారని తెలుస్తోంది. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా కొందరు నేతలు పని చేస్తున్నారని, వారి గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. తన వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారన్నారు.
రంగంలోకి చంద్రబాబు, రమ్మని పిలుపు
ఆమంచి అసంతృప్తిని గుర్తించిన టీడీపీ పెద్దలు ఆయనతో పోన్లో మాట్లాడారు. తొందరపడవద్దని, మాట్లాడుదామని చెప్పారు. ఆ తర్వాత మంత్రి శిద్ధాను రాయబారం పంపించారు. ఇరువురు గంటన్నర, రెండు గంటల పాటు భేటీ అయ్యారు. తన అసంతృప్తికి గల పూర్తి కారణాలను వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారడం మంచిది కాదని చెప్పినట్లుగా తెలుస్తోంది. కానీ ఆయన నిరాకరించారు. ఈ నేపథ్యంలో బుధవారం చంద్రబాబు రంగంలోకి దిగి, తన వద్దకు రావాలని చెప్పారు.