ఆమంచి ఎఫెక్ట్, జగన్కు రివర్స్ పంచ్: చంద్రబాబును కలిసిన చీరాల ఇంచార్జ్
చీరాల/అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 2014లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీకి అనుబంధంగా ఉన్నారు. ఇటీవల అధికార పార్టీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రావడంతో చీరాల వైసీపీలో అసంతృప్తి జాలలు వెలుగుచూశాయి. ఇన్నాళ్లు ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న వారు అసంతృప్తికి గురవుతున్నారు. ఆమంచి వైసీపీలో చేరడానికి ముందు చీరాల వైసీపీ ఇంచార్జ్గా ఎడం బాలాజీ ఉన్నారు. ఆమంచి చేరికతో ఆయనకే టిక్కెట్ ఖరారు అయినట్లుగా భావించవచ్చు.
చంద్రబాబుతో భేటీ
ఈ నేపథ్యంలో చీరాల వైసీపీ ఇంచార్జ్గా ఉన్న బాలాజీ తాజాగా సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో భేటీ అయ్యారు. టీడీపీలో ఉన్న ఆమంచి వైసీపీలోకి వెళ్లిన నేపథ్యంలో, వైసీపీ ఇంచార్జ్ టీడీపీ అధినేతతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. టిక్కెట్ పైన హామీ వస్తే ఆయన టీడీపీలోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
నాడు మూడో స్థానంలో నిలిచిన బాలాజీ
2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి సమీప అభ్యర్థి టీడీపీకి చెందిన పోతుల సునీతపై 10వేల పై చిలుకు మెజార్టీతో గెలిచారు. వైసీపీ నుంచి పోటీ చేసిన బాలాజీ ఎడం మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇన్నాళ్లు వైసీపీ ఇంచార్జిగా ఉన్న తనకు టిక్కెట్ ఇవ్వకుండా ఆమంచికి చేర్చుకోవడంపై ఆగ్రహంతో ఉన్న బాలాజీ.. టీడీపీ అభ్యర్థికి మద్దతిస్తారా లేక టిక్కెట్ ఆశిస్తున్నారా తెలియాల్సి ఉంది.
పార్టీ మారడంపై తోట త్రిమూర్తులు
మరోవైపు, తాను టీడీపీని వీడుతాననే ప్రచారంపై రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు స్పందించారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు. చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ... పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలతో చర్చిస్తానని, కార్యకర్తల అభీష్టం మేరకే వెళ్తానని ఎక్కడా చెప్పలేదన్నారు.