పార్టీలోకి పిలిచి, ఇంత మోసం చేస్తావా?: జగన్పై సొంత పార్టీ నేత నిప్పులు, ఓడిస్తానని వార్నింగ్
చీరాల: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆమంచి చేరిక చీరాల వైసీపీలో ముసలంకు దారి తీసింది. ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న చీరాల వైసీపీ ఇంచార్జ్ యడం బాలాజీ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆమంచిని పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన తప్పుబడుతున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
రాజకీయాలపై ఆసక్తి లేదు, కానీ: జగన్ను ఎందుకు కలిశానో చెప్పిన నాగార్జున
ఇది దారుణం.. జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన చీరాల ఇంచార్జ్
ఎనిమిదేళ్లుగా అరాచకాలకు పాల్పడుతున్న ఆమంచి పైన తాను పోరాటం చేస్తున్నానని, వైసీపీ పుట్టినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో తాను వైసీపీని కాపాడుకుంటూ వచ్చానని యడం బాలాజీ అన్నారు. తనపై తప్పుడు కేసులు బనాయించినా తాని భయపడలేదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఆమంచిని ధీటుగా ఎదుర్కొనేలా పార్టీ కేడర్ను సిద్ధం చేశానని, వైసీపీని ప్రజల్లోకి తీసుకు వెళ్లానని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమంచి వంటి దుష్టశక్తులను పార్టీలో చేర్చుకోవడం దారుణమని జగన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఓడించి తీరుతా.. జగన్కు వార్నింగ్
ఆమంచి చేరికపై పార్టీ అధినేత పునరాలోచన చేయాలని బాలాజీ హితవు పలికారు. లేదంటే తాను చీరాలలో వైసీపీని ఓడించి తీరుతానని హెచ్చరించారు. తాను రాసిన లేఖకు మూడ్రోజుల్లో సమాధానం కావాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే కార్యకర్తల కోరిక మేరకు పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పారు. ఆమంచిని తీసుకునేముందు కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పారు.
జగన్ను కలిసేందుకు ప్రయత్నాలు చేశా కానీ
ఆమంచి చేరికపై మాట్లాడేందుకు జగన్ను కలిసేందుకు ప్రయత్నాలు చేశానని, కానీ అవకాశం ఇవ్వలేదని బాలాజీ అన్నారు. ప్రకాశం జిల్లాలో చాలామంది జగన్ తీరు పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. పార్టీ కోసం తాము మొదటి నుంచి పని చేస్తున్నామని, కానీ చివరి నిమిషంలో వచ్చిన వారిని అందలం ఎక్కించడం ఏమిటని ప్రశ్నించారు. ఇన్నేళ్లు పార్టీని నమ్ముకొని పని చేస్తే ఇచ్చే గౌరవం ఇదా అన్నారు.
ఆమంచి అరాచకాలు ఎదుర్కోవాలని జగనే నన్ను పిలిచి మోసం చేశారు
చీరాల నియోజకవర్గంలో ఆమంచి అరాచకాలను ఎదుర్కొనేందుకు జగన్ తన కుటుంబాన్ని స్వయంగా పిలిపించారని, అప్పుడు పార్టీలోకి పిలిచి, ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని బాలాజీ అన్నారు. తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని చెప్పారు. జగన్ చేసిన తీవ్ర మోసానికి, పాపానికి తన మనసు ఎంతో క్షోభిస్తోందని తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. జగన్ తన లేఖకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనకు అవకాశమిస్తే సర్వశక్తులు ఒడ్డి తాను ఆమంచిని ఓడిస్తానని చెప్పారు. కాగా, జగన్ తనకు అనుకూలంగా లేకుంటే బాలాజీ టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.