కేసీఆర్, చంద్రబాబులా జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారా, చిరంజీవికి గుడ్న్యూస్ చెప్పేనా?
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ శుక్రవారం (అక్టోబర్ 11) మధ్యాహ్నం 11 గంటల సమయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. ఇప్పటికే అపాయింటుమెంట్ ఖరారయినట్లుగా తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక టాలీవుడ్ ప్రముఖులు పెద్దగా కలిసింది లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక చిరంజీవి కూడా తొలిసారి ఏపీ సీఎంతో భేటీ అవుతున్నారు. చిరంజీవి, జగన్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేకపోయినప్పటికీ అందరి దృష్టిని మాత్రం ఆకర్షిస్తోంది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.
పార్టీలో మనం ఉండకపోచ్చు.!కానీ పార్టీలో మన ఉనికి శాశ్వతం కావాలి..!గంటా కి చిరు హితబోధ..!!
అందుకే చిరంజీవి, జగన్ కలయికకు ప్రాధాన్యత
పదేళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డి, చిరంజీవి మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. ఈ విషయాన్ని పక్కన పెడితే చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఉన్నారు. 2014లో టీడీపీతో పొత్తుతో, 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. ఎన్నికల సమయంలో నాడు అధికారంలో ఉన్న చంద్రబాబుతో పాటు ప్రతిపక్ష నేత జగన్ పైన కూడా విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం పవన్ ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా పవన్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో జగన్ను చిరంజీవి కలుసుకోవడానికి ప్రాధాన్యత ఏర్పడింది.
చిరంజీవికి గుడ్ న్యూస్ చెప్పనున్న సీఎం జగన్ ?
సైరా విజయయాత్ర
చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ నిర్మాతగా వచ్చిన సైరా నరసింహా రెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ప్రముఖులను కలుస్తూ పరోక్షంగా ప్రమోషన్ చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ను కలిసి సైరా సినిమా చూడాలని కోరారు. ప్రత్యేక షో వేసి చూపించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ను కలుస్తున్నారు. సైరా సినిమా విజయయాత్ర గురించి చెప్పనున్నారని తెలుస్తోంది.
జగన్కు కంగ్రాట్స్.. థ్యాంక్స్
జగన్ సీఎం అయిన తర్వాత చిరంజీవి నేరుగా ఆయనను కలిసింది లేదు. ఇప్పుడు కలుస్తున్న నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయినందుకు జగన్కు కంగ్రాట్స్ చెప్పనున్నారు. అలాగే, సైరా రిలీజ్ సందర్భంగా ప్రత్యేక షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు థ్యాంక్స్ చెప్పనున్నారు. అలాగే సైరా సినిమాను చూడవలసిందిగా జగన్ను మెగాస్టార్ కోరనున్నారు.
సైరాకు గుడ్న్యూస్ చెబుతారా..
జగన్, చిరంజీవి కలయిక నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ సాగుతోంది. సైరా నరసింహా రెడ్డి సినిమాలోని రియల్ హీరో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కర్నూలు జిల్లాకు చెందినవారు. ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఏపీ ప్రభుత్వం వినోద పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశాలు లేకపోలేదనే చర్చ సాగుతోంది.
పవన్ను మరింత కార్నర్ చేస్తారా?
చిరంజీవి, జగన్ కలయికకు రాజకీయ ప్రాధాన్యత లేకపోయినప్పటికీ.. ఇప్పటికే వైసీపీ వర్గాలు దీనిని తమకు అనుకూలంగా.. చిరు సోదరుడు పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. సైరా సినిమా సాధారణ కమర్షియల్ సినిమా కాదు. ఓ స్వతంత్ర సమరయోధుడి గాథ. అదీ ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడది. కాబట్టి సైరా సినిమా విషయంలో జగన్ను చిరంజీవి కలవడం ప్రమోషన్లో భాగంగా చూడాలే తప్ప, రాజకీయ ప్రాధాన్యత ఏమాత్రం లేదని చెబుతున్నారు. రాష్ట్రానికి చెందిన ఓ మహోన్నతుడి చరిత్రను తెరకెక్కించినప్పుడు అదనపు షోలకు అనుమతి, అపాయింటుమెంట్ ఇవ్వడం, అవసరమైతే వినోద పన్ను మినహాయింపు ఇవ్వడం సహజమని చెబుతున్నారు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ను కార్నర్ చేసేందుకో.. మరో రాజకీయ ప్రయోజనమో ఇందులో చూడకూడదని అంటున్నారు. అది ప్రభుత్వం బాధ్యత అంటున్నారు.
శాతకర్ణి, రుద్రమదేవి...
గతంలో చారిత్రాత్మక కథాంశాలతో తెరకెక్కిన కొన్ని సినిమాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వినోద పన్నును మినహాయించాయి. ఈ నేపథ్యంలో ఉయ్యాలవాడ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమాకు కూడా ఏపీ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయిస్తే బాగుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు రెండు ప్రభుత్వాలు కూడా వినోద పన్నును మినహాయించాయి. రుద్రమదేవి విషయంలోను ఇదే జరిగింది. గతంలో కేసీఆర్, చంద్రబాబులు మినహాయింపు ఇచ్చినట్లుగా ఓ చారిత్రాత్మక కథనానికి జగన్ కూడా పన్ను మినహాయింపుతో ఊరటను ఇస్తారా అనేది చూడాలని అంటున్నారు. ఇలాంటి సినిమాలను ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తేనే మరిన్ని వస్తాయని అంటున్నారు.