సీఎం జగన్ నివాసానికి చిరు దంపతులు: లంచ్ మీటింగ్ లో భారతి..సురేఖ సైతం..!
సర్వత్రా ఆసక్తికి కారణమైన సీఎం జగన్ ..మెగాస్టార్ చిరంజీవి లంచ్ మీటింగ్ లో మరో ఆసక్తి కర అంశం తెర మీదకు వచ్చింది. తనను కలవాలని భావిస్తున్న చిరంజీవిని ముఖ్యమంత్రి జగన్ తన నివాసానికి లంచ్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. మరి కాసేపట్లో వీరి భేటీ జరగనుంది. తొలుత చిరంజీవితో పాటుగా రాం చరణ్ ఈ లంచ్ సమావేశానికి హాజరవుతారని భావించారు.
అయితే, అనూహ్యంగా ఈ లంచ్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతితో పాటుగా చిరంజీవి సతీమణి సురేఖ సైతం పాల్గొంటున్నారని సమాచారం. చిరంజీవిని ముఖ్యమంత్రి తన ఇంటికి విందుకు ఆహ్వానించే సమయంలో సతీ సమేతంగా రావాలని కోరారు. అదే విధంగా భారతీ సైతం నేరుగా సురేఖ తో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. దీంతో..తన సతీమణితో సహా చిరంజీవి విజయవాడకు బయల్దేరారు.
ఆర్టీసీ విలీనం పై జేపీ సంచలనం: జగన్ ది తిరోగమన చర్య..ఓట్ల కోసమే: కేసీఆర్..కార్మికుల సమ్మెపై ఇలా..!
సీఎం దంపతులతో చిరంజీవి దంపతులు
మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రిని కలవాలని భావించిన చిరంజీవికి సీఎం జగన్ నుండి వ్యక్తమైన అభిమానం..సతీ సమేతంగా విందుకు రావాలని ఆహ్వానాన్ని వెంటనే అంగీకరించారు. అదే సమయంలో భారతి సైతం ఆహ్వానించటంతో చిరంజీవి సతీమణి సైతం రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేవలం సైరా సినిమా గురించి మాత్రమే ఈ సమావేశం పరిమితం అవుతుందని చెబుతున్నా..రాజకీయ వర్గాలతో పాటుగా సినీ పరిశ్రమ లోనూ ఈ సమావేశం పైన ఆసక్తి పెరిగిపోతోంది. అయితే, ఇప్పటి వరకు మెగా కుటుంబంలో ఎవరూ జగన్ ను కలవలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారు. చిరంజీవి రాజకీయాల్లో ఉన్న సమయంలోనూ..అదే విధంగా జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఎక్కడా ఎటువంటి కామెంట్లు చేయలేదు. అయితే, ఇది ఇద్దరి మధ్య జరుగుతున్న తొలి సమావేశం..అందునా ఏపీలో ప్రతీ అంశానికి రాజకీయంగా లింకు ఉంటుండటంతో ఇప్పుడు ఈ భేటీ ఆసక్తి కరంగా మారింది.
సైరా ప్రత్యేక షోల అనుమతి సమయంలోనూ..
సైరా సినిమాకు ఏపీలో ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని కొణిదెల నిర్మాణ సంస్థ నుండి ఏపీ ప్రభుత్వానికి లేఖ అందింది. సెప్టెంబర్ 9న ఆ లేఖ వచ్చినా..ప్రభుత్వంలోని అధికారులు సీరియస్ గా తీసుకోలేదు. అక్టోబర్ రెండున సినిమా విడుదల అయింది. ముందు రోజు సాయంత్రం చిరంజీవి కుటుంబానికి అతి దగ్గరగా ఉండే ఒక ప్రముఖుడు..సీఎం జగన్ తో ఇదే అంశం పైన మాట్లాడటంతో వెంటనే ఆయన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారని సమాచారం. అయితే, అంతుకు ముందే ప్రభాస్ నటించిన సాహో సినిమాకు అనుమతి లేదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు సైరా కు అనుమతి ఇవ్వటం ద్వారా భవిష్యత్ సమీకరణాలను పరిగణలోకి తీసుకొనే అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
భారతీ...ఉపాసనా మధ్య ఫ్రెండ్ షిప్..
పారిశ్రామిక రంగంలో రాణిస్తున్న ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతి..రాం చరణ్ సతీమణి ఉపాసన ఇద్దరి మధ్య స్నేహ బంధం ఉంది. అనేక సమావేశాల్లో వారిద్దరూ కలుసుకున్నారు. అదే విధంగా టీడీపీ నేతల సినీ హీరో బాలక్రిష్ట కుమార్తె..లోకేశ్ సతీమణి బ్రాహ్మణితోనూ ఉపాసనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలా..ఇప్పుడు జగన్ నివాసానికి చిరంజీవి తన సతీమణితో రావటం ద్వారా మీటింగ్ లోనే ఈ అంశం ప్రత్యేకార్షణగా మారుతోంది. ఈ మొత్తం సమావేశం పైన సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాలు కూడా ఈ పరిణామాలను ఆసక్తికరంగా గమనిస్తున్నాయి.