‘చిరంజీవి ఎక్కడికీ పోరు! ఎప్పటికీ మాతోనే ఉంటారు’
శనివారం ఉదయం జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశానికి ఆ పార్టీ నేత, ప్రముఖ సినీనటుడు చిరంజీవి హాజరుకాకపోవడంపై ఆసక్తికర చర్చ జరిగింది.
హైదరాబాద్/అమరావతి: శనివారం ఉదయం జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశానికి ఆ పార్టీ నేత, ప్రముఖ సినీనటుడు చిరంజీవి హాజరుకాకపోవడంపై ఆసక్తికర చర్చ జరిగింది. అనివార్య కారణాల వల్లే చిరంజీవి ఈ సమావేశానకి గైర్హాజరు కావాల్సి వచ్చిందని మాజీ ఎంపీ పళ్లంరాజు వివరణ ఇచ్చారు.
ఊహాగానాలే..
కొన్ని అనివార్య కారణాలతోనే ఆయన రాలేదని, వేరే పనుల్లో బిజీగా ఉన్నానని ఆయన సమాచారం ఇచ్చారని పళ్లంరాజు తెలిపారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడి ఎక్కడికీ పోరని, ఆయన ఇతర పార్టీల్లో చేరుతారన్న వార్తలు ఊహాగానాలేనని స్పష్టం చేశారు.
చిరంజీవి బిజీ
ప్రస్తుతం చిరజీవి సినీరంగంలో కొంత బిజీగా ఉన్నారని చెప్పారు. సమావేశం అనంతరం కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పలు అంతర్గత విషయాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చించామని, రాష్ట్రంలోని పరిస్థితులను విశ్లేషించామని ఆయన అన్నారు.
పలు అంశాలపై..
ప్రజా బ్యాలెట్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నిరసనలు, నోట్ల రద్దు తరువాత ప్రజల ఇబ్బందులు, రాష్ట్రంలో సాగుతున్న పాలనలో లోటుపాట్లు తదితరాలపై కూలంకుషంగా చర్చించామని వెల్లడించారు.
చిరంజీవిపై ఊహాగానాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందని, మరింత బలోపేతం చేసేందుకు కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కాగా, చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడతారనే వార్తలు వస్తుండటం, సమావేశానికి హాజరుకాకపోవడంతో పళ్లంరాజు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.