భర్తతో కలిసి బెజవాడకు శ్రీజ, చంద్రబాబును కలిసిన బాలీవుడ్ హీరో
విజయవాడ: ఇటీవలే వివాహమైన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన భర్త కల్యాణ్తో కలసి మంగళవారం విజయవాడలో పర్యటించారు. ఉదయం బెజవాడ కనకదుర్గ గుడికి వచ్చారు. నూతన దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
వారికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, వారికి ప్రసాదం అందించారు. గులాబీ రంగు చీరలో శ్రీజ, కుర్తా ప్యాంటులో కల్యాణ్ గుడిలో కాసేపు అటూ ఇటూ తిరిగారు. వీరిద్దరినీ చూడటానికి ఆ సమయంలో అక్కడున్న భక్తులు ఆసక్తి కనబర్చారు.
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ వివాహం కొద్ది రోజుల క్రితం బెంగుళూరులో జరిగిన సంగతి తెలిసిందే. జ్యువెలరీ డిజైనర్ కల్యాణ్తో శ్రీజ వివాహం జరిగింది. పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన దీనికి కుటుంబ సభ్యులు, కొందరు ప్రముఖులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు.
అనంతరం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో కూడా విడుదలైంది. ఈ వీడియోలో చిరంజీవి అల్లుడికి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం, మూడు ముళ్లు, తలంబ్రాలు, జీలకర్రబెల్లం ఘట్టం లాంటివి ఆకట్టుకుంటున్నాయి. ఆ తర్వాత వెడ్డింగ్ రిసెప్షన్ కూడా జరిగింది.
బాబును కలిసిన అజయ్ దేవగణ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ మంగళవారం భేటీ అయ్యారు. విజయవాడలోని సీఎం కార్యాలయంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. పలు విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.