పవన్కు జిందాబాద్, షటప్.. అభిమానిపై చిరు ఆగ్రహం
అనంతపురం/హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు ప్రచార సారథి చిరంజీవికి గురువారం అనంతపురం జిల్లాలో చేదు అనుభవం ఎదురయింది. బస్సుయాత్రలో భాగంగా కాంగ్రెసు నేతల యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు గుప్పిస్తున్నారు.
విభజనకు కాంగ్రెసు పార్టీయే కారణం కాదని.. బిల్లుకు మద్దతిచ్చిన బిజెపి వైపు కొందరు నేతలు ఎలా వెళ్తున్నారని చిరంజీవి ప్రశ్నించారు. బిజెపిపై నిప్పులు చెరిగారు. చిరు బిజెపి పైన విమర్శలు చేస్తున్న సమయంలో ఓ అభిమాని పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అతనికి కొందరు జతకలిసినట్లుగా తెలుస్తోంది.
దీంతో కోపం వచ్చిన చిరంజీవి నినాదాలు చేస్తున్న అభిమానుల పైన మండిపడ్డారట. షటప్ అంటూ వారిని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ఉండగా... ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో పార్టీని స్థాపించి బిజెపికి మద్దతిచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.
కాగా, రాష్ట్రంలోని 23 జిల్లాలకు సంబంధించి చిరంజీవి యువత అధికార ప్రతినిధుల నియామకం గురువారం జరిగింది. హైదరాబాదులోని ఫిలిం క్లబ్లో చిరంజీవి యువత సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగానే ఈ నియామకాలు కూడా జరిగాయి. మెగా ఫ్యామిలీ రెండు పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేపథ్యంలో, చిరు యువత భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించారు. ఇకపై రాజకీయపరంగా చిరంజీవికి, కుటుంబపరంగా పవన్ కళ్యాణ్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.