జగన్ గారు అర్థంచేసుకోండి - మెగాస్టార్ అప్పీల్ : సాయి పల్లవిపై చిరంజీవి మదిలో - ఇలా..బయట పెట్టేసారు ..!!
మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యల పైన ఆవేదన వ్యక్తం చేసారు. అసలు సమస్యను ప్రస్తావించారు. రెండు తెలుగు ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి సినీ పరిశ్రమ కరోనా సమయంలో ఏ రకంగా ఎదుర్కొన్నదీ..ఇప్పుడు ఎటువంటి సమస్యలతో ఉన్నదీ వివరించారు. ఏదైనా ముందుగా చూసి కొనుగోలు చేస్తామని...కానీ, సినిమా మాత్రమే తమ మీద నమ్మకంతో కొన్నాక చూస్తారని చెప్పుకొచ్చారు. కరోనా తరువాత సినిమా నిర్మాణ ఖర్చు భారీగా పెరిగి..భారంగా మారిందన్నారు.
ఇద్దరు సీఎంలు ధైర్యం కల్పించాలి
చాలా ఎక్కువ ఖర్చుతో సినిమాలు నిర్మించాల్సి వస్తోందని వివరించారు. పూర్తయిన సినిమాలు విడుదల చేద్దామన్నా..రెవిన్యూ వస్తుందా రాదా అనే భయం వెంటాడుతుందన్నారు. తాను నటించిన ఆచార్య మూవీ పూర్తయిందని..కానీ, విడుదల చేయాలంటేనే ఆలోచన చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు తెలుగు ప్రభుత్వాలు తమకు ధైర్యం కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. తాము కోరిన సమస్యల పైన పరిష్కారం చూపుతూ జీవోలు ఇవ్వాలని సూచించారు.
జగన్ గారు కనికరించండి
ఏపీ సీఎం జగన్ గారు సానుకూలంగా స్పందించండి. ఎవరో నలుగురు అయిదుగురు హీరోలు..డైరెక్టర్లు బాగా సంపాయిస్తున్నారని అనుకోవద్దని..మా సమస్యలు వివరించామని చెబుతూనే...వాటిని పరిష్కరించే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇండస్ట్రీ చాలా ఇబ్బందుల్లో ఉందని ఇద్దరు తెలుగు సీఎంలకు చెప్పుకొచ్చారు. అందరూ కాదని..నలుగురు అయిదుగురు మాత్రమే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని..వారిని చూసి మిగిలిన వారి ఇబ్బందులు పట్టించుకోకుండా వదిలేయద్దన్నారు.
సినీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉందంటూ
తాము ఎటువంటి డిమాండ్ చేయటం లేదని..పరిశ్రమ భవిష్యత్ కోసం నిర్ణయం తీసుకోవాల్సింది కోరుతున్నామంటూ చెప్పారు. ఇక, లవ్ స్టోరీ మూవీ లో హీరో నాగ చైతన్య తన మిత్రుడు నాగార్జున తనయుడు అని మంచి భవిష్యత్ ఉందని ప్రశంసించారు. మిగిలిన యూత్ హీరోల కంటే నాగ చైతన్య భిన్నమని చెప్పుకొచ్చారు. ఇక, ఇదే ఈవెంట్ లో సాయి పల్లవి గురించి చిరంజీవి చేసిన కామెంట్స్ అందరినీ కట్టి పడేసాయి. తాను నటిస్తున్న ఒక సినిమాలో సాయి పల్లవిని తనకు సోదరి గా నటించమనే ప్రతిపాదన వచ్చిందన్నారు.
సాయి పల్లవితో రొమాంటిక్ పాటలు చేయాలని
తాను మాత్రం మనసులో దీనిని నిర్మాతలు ఒప్పుకోకూడదని కోరుకున్నానంటూ తన మనసు లోని ఫీలింగ్ బయట పెట్టేసారు. తాను అనుకున్న విధంగానే సాయి పల్లవి తాను చేయనని చెప్పటంతో తన మనసు కుదుట పడిందని వివరించారు. తన సోదరుడు కుమారుడైన వరుణ్ తేజ్ .. సాయి పల్లవి కలిసి నటించిన సినిమా ఎలా ఉందంటూ వరుణ్ తనను అడిగాడని..తాను మాత్రం సాయి పల్లవినే చూసానంటూ చెప్పానని చిరంజీవి గుర్తు చేసారు. ఇక, తాను సాయి పల్లవితో రొమాంటిక్ పాటలకు డాన్స్ చేయాలని కోరుకుంటున్నానంటూ చిరంజీవి తన మనసులోని అసలు విషయాన్ని బయట పెట్టటంతో అంతా ఒక్క సారిగా క్లాప్స్ కొడుతూ అనందించారు.
సాయి పల్లవికి మెగా ఆఫర్
సాయి పల్లవి ఒప్పుకుంటే తనతో ఒక సినిమాలో హీరోయిన్ గా మంచి పాటలకు డాన్స్ చేస్తానని చెప్పారు. దీంతో..సాయి పల్లవి ఎమోషనల్ అయింది. తనకు చిరంజీవితో చేయకూడదనే ఆలోచన లేదన్నారు. తనకు రీమేక్ సినిమాలంటే భయమని చెప్పుకొచ్చారు. చిరంజీవితో కలిసి చేయటం తాను ఊహించలేదని చెప్పారు. ఈ మొత్తం గమనించిన అమీర్ ఖాన్ తనకు తెలుగు అర్దం కాకపోయినా..అంతా చూస్తున్నానని వ్యాఖ్యానించారు. తాను మంచి డాన్సర్ అని చిరంజీవి నేరుగా సాయి పల్లవి కి చెప్పారు.
Recommended Video
నాటి హీరోయిన్లను గుర్తు చేస్తూ..
తాను రాధ, శ్రీదేవి, రంభ వంటి వారితో చేసిన డాన్స్ ల గురించి చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఖచ్చితంగా సాయి పల్లవితో సినిమా చేస్తానని ప్రకటించారు. అదే విధంగా సారంగ దరియా పాటను ప్రత్యేకంగా ప్రస్తావించిన చిరంజీవి ప్రశంసలతో ముంచెత్తారు. అయితే, చిరంజీవి సినీ పరిశ్రమ సమస్యల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు పొలిటికల్ గా..ఇటు సినీ ఇండస్ట్రీలో ఆసక్తి కరంగా మారాయి. ఆన్ లైన్ టిక్కెట్ల ఇష్యూ పైన ఏపీ ప్రభుత్వం రేపు (సోమవారం) సినీ ఇండస్ట్రీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది.