హర్టయ్యా,పార్టీని అనొద్దు: చిరు ఆగ్రహం, ఏమనాలి: టిజి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు లోకసభలో ఆమోదం లభించడంతో తాను హర్ట్ అయ్యానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి మంగళవారం అన్నారు. బిల్లును ఆపేందుకు తాము శతవిధాలా ప్రయత్నించామని, చివరకి కేంద్రమంత్రులం అయి ఉండి వెల్లోకి వెళ్లామన్నారు. సీమాంధ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని పట్టుబట్టామని చెప్పారు.
ప్రజల మనోభావాలను అధ్యయనం చేసి న్యాయం చేయాలని తాము కోరామన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల భవిష్యత్తు హైదరాబాదుతో ముడివడి ఉందన్నారు. అరవయ్యేళ్లుగా అందరం కలిసి హైదరాబాదును అభివృద్ధి చేశామని చెప్పారు.
జై ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు హైదరాబాదు కావాలని ఎవరు కోరుకోలేదని ఇప్పుడు కోరుకోవడానికి ఇదే సీమాంధ్ర భవిష్యత్తు కావడమే అన్నారు. రాష్ట్రంలో హైదరాబాదు తప్ప మరో పట్టణం లేదన్నారు. తాను చాలా హర్ట్ అయ్యానన్నారు. ఇది అప్రజాస్వామిమని ధ్వజమెత్తారు.
కాంగ్రెసుకు మద్దతు
విభజన విషయంలో కాంగ్రెసు పార్టీనే తప్పు పట్టవలసిన అవసరం లేదని చిరంజీవి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపి అన్ని పార్టీలు అనుకూలంగా లేఖ ఇచ్చాయన్నారు. సిపిఎం, మజ్లిస్ మినహా అందరు సమర్థించారని, ఆ తర్వాతే కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెసు పార్టీనే తప్పు పట్టడంపై చిరు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోకసభ ప్రత్యక్ష ప్రసారాన్ని కట్ చేయడం సరికాదన్నారు. లోకసభలో బిల్లు ఆమోదం పొందినా ఆపే అవకాశముందన్నారు. రేపు రాజ్యసభకు బిల్లు రానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా రాజ్యసభలో ఓడిపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. చివరి బంతితో విభజన ఆపుతామని చెప్పిన వారిని నమ్ముకున్నామని, ఆయన సమాధానం చెప్పాలని కిరణ్ను ఉద్దేశించి అన్నారు.
ముఖ్యమంత్రి పార్టీపై...
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీపై స్పందిస్తూ.. ఆయన అప్పుడే రాజీనామా చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
విభజన చాలా దురదృష్టకరమని పళ్లం రాజు అన్నారు. కాంగ్రెసు, బిజెపిలు కలిసి పాస్ చేద్దామనుకున్నప్పుడు ఆపటం సాధ్యం కాదన్నారు.
ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు: టిజి
విభజన బిల్లుకు లోకసభలో ఆమోదం లభించడం తమను కుంగదీసిందని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. తనకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నారు.