జగన్ కే నా మద్దతు..చిరంజీవి స్పష్టీకరణ: ఆ లేఖ..ప్రచారం ఫేక్: మెగాస్టార్ ఎందుకిలా..!
ముఖ్యమంత్రి జగన్ కు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మరో సారి మద్దతు ప్రకటించారు. సీఎం నిర్ణయాన్ని సమర్ధిస్తున్నానని స్పష్టం చేసారు. రాజకీయంగా టీడీపీ..బీజేపీ నేతలు చిరంజీవి నిర్ణయాన్ని విమర్శిస్తు న్నా..ఆయన మాత్రం తాను జగన్ కే మద్దతు అని స్పష్టం చేస్తున్నారు. శనివారం చిరంజీవి రాష్ట్రానికి మూడు రాజధానులపై ప్రభుత్వం చేసిన ప్రకటనకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని స్పష్టం చేస్తూనే.. కొన్ని సూచనలు..తన అభిప్రాయాలతో లేఖ విడుదల చేసారు. అయితే, ఆదివారం చిరంజీవి పేరుతోనే మరో లేఖ విడుదల అయింది. దీని పైన వివరణ ఇచ్చిన చిరంజీవి..తాను జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నానని పునరుద్ఘాటించారు. తన పైన వస్తున్న రాజకీయ విమర్శలపైన మాత్రం స్పందించలేదు. అయితే, మెగాస్టార్ ఆలోచన..వ్యూహం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
చిరంజీవి పేరుతో లేఖ.. ఫేక్ అంటూ..
ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన..జీఎన్ రావు కమిటీ సిఫార్సులకు మద్దతుగా తన అభిప్రాయం స్పష్టం చేసిన చిరంజీవి ఏపీలో కొత్త చర్చకు కారణమయ్యారు. ఒక వైపు ఆయన సోదరులిద్దరూ రాజధాని రైతులకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం పైన అంత సుముఖంగా లేరు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ కే మద్దతు ప్రకటిస్తూ చిరంజీవి లేఖ విడుదల చేసారు.
అందులో అనేక అంశాలను ప్రస్తావించారు. దీని పైన రాజకీయంగా విమర్శలు సైతం మొదలయ్యాయి. ఇదే సమయంలో మరో లేఖ వైరల్ అయింది. అందులో యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయు నది..ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుని సమర్థిస్తూ గానీ, వ్యతిరేకిస్తూ గానీ నేను ఏవిధమైన ప్రకటన చేయలేదు...తెలుగు ప్రజలకు చేరు వచేసి, నన్నింతవాణ్ణి చేసిన సినిమా రంగం మీదే నాదృష్టి ఉంది. దయచేసి గమనించగలరు.. అంటూ ఒక లేఖ వైరల్ అయింది. దీనిపైన వెంటనే చిరంజీవి స్పందించారు. తాను తన మాట మార్చుకోలేదని ..తన పేరుతో ఈ రకంగా వైరల్ అవుతున్న లేఖ ఫేక్ అని తేల్చి చెప్పారు.
జగన్ నిర్ణయానికి మద్దతు..విమర్శలు..
రాష్ట్రానికి మూడు రాజధానులపై ప్రభుత్వం చేసిన ప్రకటనకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఆదివారం పునరుద్ఘాటించారు. మూడు రాజధానులకు మద్దతుగా చేసిన ప్రకటనకే తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. చిరంజీవి ప్రకటన పైన బీజేపీ..వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. వైసీపీలో చేరుతారేమోనంటూ టీడీపీ నేతలు విమర్శిస్తే.. విశాఖలో భవిష్యత్ ప్రయోజనాల కోసమే చిరంజీవి ముఖ్యమంత్రికి మద్దతు ప్రకటిస్తున్నారని బీజేపీ నేత ఆరోపించారు.
అయితే, వీటి మీద మాత్రం చిరంజీవి స్పందించలేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పైన తనకు నమ్మకం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. దీంతో.. మరోసారి తన స్టాండ్ ఏంటనేది చిరంజీవి తేల్చి చెప్పారు. చిరంజీవి నిర్ణయం పైన మెగా ష్యాన్స్ ల మాత్రం ఆసక్తి కర చర్చ సాగు తోంది. చిరంజీవి తాజా ప్రకటన మీద సైతం రాజకీయంగా విమర్శలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
చిరంజీవి ఎందుకిలా..వెంటనే స్పందించాలా
ఇక, చిరంజీవి ప్రకటన పైన అటు రాజకీయల..సినీ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. రాజధానుల అంశం మీద ప్రభుత్వం ప్రతిపాదనలు మాత్రమే చెప్పింది. అధికారికంగా ప్రకటన చేయలేదు. ఈ సమయంలో చిరంజీవి ఎందుకు ఇంత త్వరగా స్పందించారనేది ఇప్పుడు చర్చ. అందునా..ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత సినీ ప్రముఖులు ఆయన్ను కలవలేదు. సైరా సినిమా చూడటానికి సీఎం ను ఆహ్వానించేందుకు సతీ సమేతంగా చిరంజీవి వెళ్లగా..సీఎం సైతం విందుకు ఆహ్వానించారు.
ఇక, తాజాగా జగన్ ప్రతిపాదన పైన చిరంజీవి పూర్తి మద్దతు ప్రకటించటం వెనుక రాజకీయ ఆలోచనలు ఉన్నాయా అనే కోణంలోనూ చర్చ సాగుతోంది. కారణాలు ఏవైనా.. ముఖ్యమంత్రి జగన్ తో మాత్రం చిరంజీవి సన్నిహిత సంబంధాలు మాత్రం కోరుకుంటున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.