కలిసొస్తే ముఖానికి రంగు వేసుకుంటా: చిరంజీవి
హైదరాబాద్: అన్నీ కుదిరితే తాను తన 150వ సినిమా చేస్తానని కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రాష్ట్ర విభజన అంశం ఒక కొలిక్కి రావడంతో ముఖానికి రంగు వేసుకుని తన 150వ సినిమాను పూర్తి చేయడానికి చిరంజీవి సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది.
సమయం వచ్చినప్పుడు తాను నటిస్తానని, అన్నీ సరిగా కుదిరితే తాను సినిమా చేస్తానని ఆయన గురువారంనాడు అన్నారు. సోదరుడు నాగబాబు కుమారుడు వరణ్ తేజ సినిమా ముహూర్తానికి చిరంజీవి భార్య సురేఖతో కలిసి వచ్చారు.
వరణ్ తేజ సోదరుడు ధరమ్ తేజ ఇప్పటికే సినిమాల్లోకి వచ్చాడు. ఆయన సినిమా రేయ్ వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ తేజ సినిమా షూటింగ్కు కొంత సమయం వెచ్చించాడు.
కన్యాకుమారిలో షూటింగ్లో పాల్గొంటున్న తన కుమారుడు రామ్ చరణ్ తేజతో తాను మూడు రోజుల పాటు ఉన్నానని, షూటింగ్ కారణంగా రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి రాలేకపోయాడని చిరంజీవి చెప్పారు.
వరణ్ తేజను చిరంజీవి ఆరున్నర అడుగుల అందగాడిగా అభివర్ణించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాననే విషయం తనకు తెలుసునని, తాను సినిమా చేయాలని అనుకుంటున్నానని, అయితే తన చేతుల్లో ఏదీ లేకుండా పోయిందని, అది దేవుడి చేతుల్లో ఉందని చిరంజీవి అన్నారు.