పవన్ కళ్యాణ్ నివాళులు, కంటతడిపెట్టిన చిరు, సీటు బెల్టుపై..
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరాం మృతదేహానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవిలు నివాళులు అర్పించారు. మాసాబ్ ట్యాంక్లోని హరికృష్ణ నివాసానికి వచ్చిన చిరు, పవన్ నివాళులు అర్పించిన అనంతరం హరికృష్ణ కుటుంబాన్ని ఓదార్చారు.
జానకిరాం భౌతికకాయాన్ని చూసి చిరంజీవి చలించిపోయారు, కంటతడిపెట్టారు. హరికృష్ణను ఓదార్చిన తర్వాత బయటకు వచ్చిన చిరు విలేకరులతో మాట్లాడారు. ఆ సమయంలో దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. జానకిరాం మృతి దురదృష్టకరమన్నారు. ఈ సమయంలో ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. గొంతు బొంగురుపోయింది.
అందరు కూడా ప్రయాణం సమయంలో సీటు బెల్టు ప్రాధాన్యతను చెప్పారు. అందరు కూడా తప్పకుండా సీటు బెల్టు పెట్టుకోవాలన్నారు. విధిని ఎవరు తప్పించుకోలేరన్నారు. కాగా, జానకిరాంకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ పలువురు ప్రముఖులు హరికృష్ణ నివాసానికి చేరుకుని జానకిరాం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
నందమూరి హరికృష్ణను సోదరుడు బాలకృష్ణ ఓదార్చారు. సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్, దర్శకుడు రాఘవేంద్ర, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీప్రణీత, లక్ష్మీపార్వతి, పరుచూరి వెంకటేశ్వరరావు, జగపతి బాబు, జీవిత, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు జానకిరాంకు పూలమాల వేసి నివాళులర్పించారు.
మధ్యాహ్నం 2 గంటలకు జానకిరామ్ అంతిమయాత్ర ప్రారంభంకానుంది. సాయంత్రం 4 గంటలకు మొయినాబాద్ ఫాంహౌస్లో జానకిరామ్ అంత్యక్రియలు జరుగనున్నాయి. శనివారం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్న జానకిరామ్ వాహనం నల్లగొండ జిల్లా మునాగాల మండలం ఆకుపాముల సమీపంలో ప్రమాదానికి గురైంది. జానకిరాంస్వయంగా నడిపిస్తున్న వాహనాన్ని రాంగ్రూట్లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ అతను మృతి చెందారు.