విజయవాడలో చిరంజీవి, పవన్కల్యాణ్, రామ్చరణ్ అభిమానుల సమావేశం
మెగాస్టార్ చిరంజీవి, పవర్స్టార్ పవన్కల్యాణ్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ అభిమానులు సంయుక్తంగా విజయవాడలో సమావేశమయ్యారు. వీరి సమావేశంలో ఒకటే అజెండా. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకోసం పనిచేయడం. ఎట్టి పరిస్థితుల్లోను పవన్కల్యాణ్ను ముఖ్యమంత్రిగా చేయడమే అజెండాగా పనిచేయాలని సమావేశంలో తీర్మానించారు.

ప్రతి జిల్లా నుంచి పరిమిత సంఖ్యలో ఆహ్వానం
అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు అధ్యక్షతన విజయవాడలోని మురళీ ఫార్ఛ్యూన్ హోట్లో ఈ సమావేశం జరిగింది. ప్రతి జిల్లా నుంచి అభిమాన సంఘాల తరఫున పరిమిత సంఖ్యలో ఆహ్వానించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామాన్ని పర్యటించి పవన్ అధికారంలోకి వస్తే పరిపాలన ఎలా ఉంటుందనేది తెలియజెప్పడంతోపాటు పవన్వైపు సానుభూతిపరులుగా ఉన్నవారిని కూడా కలుపుకొని ముందుకు వెళ్లాలనేది ప్రధానమైన అజెండా గా మారింది.

మెగా అభిమానులంతా కలిసికట్టుగా జనసేన కోసం
త్వరలోనే మరికొన్ని సమావేశాలు నిర్వహిస్తామని స్వామినాయుడు తెలిపారు. నాయకులకు, అభిమానులకు మధ్య ఎటువంటి అంతరాలు లేవని తెలిపారు. పొత్తుల విషయమై తాము ఏమీ మాట్లాడమని, తమ అధినేత ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. మెగా అభిమానులందరూ కలిసికట్టుగా జనసేన కార్యకర్తలుగా పనిచేస్తారని, ప్రజారాజ్యం సమయంలో కుటుంబాలను కూడా వదిలి పార్టీ కోసం పనిచేశామని, అప్పుడు ప్రజారాజ్యంపై ఇతర పార్టీలు అనేక కుట్రలు చేశాయన్నారు.

జనసేనానిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ అభిమానుల ఆగ్రహం
జనసేనపై అసత్యాలు ప్రచారం చేయడంతోపాటు పార్టీ అధినేత పవన్కల్యాణ్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో పలచన చేయాలని చూస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. పవన్కల్యాణ్కు, చిరంజీవికి, అల్లు అర్జున్కు, రామ్చరణ్కు అంటూ ప్రత్యేకమైన అభిమానులు లేకపోయినప్పటికీ అందరి అభిమానులు ఒకటే కావడంతో వీరందరినీ సమన్వయం చేసే బాధ్యత, రాబోయే ఎన్నికల కోసం పనిచేయించాల్సిన అవసరాన్ని స్వామినాయుడికి అప్పగించినట్లు సమాచారం.