సీమాంధ్రలో జగన్, బాబుతో ఢీ: పిసిసి రేసులో చిరంజీవి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)కు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపడంతో కాంగ్రెసు పార్టీ అధిష్టానం రెండు రాష్ట్రాలకు పిసిసి అధ్యక్షులు, కొత్త ముఖ్యమంత్రులు లేదా రాష్ట్రపతి పాలన అంశాల పైన దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేసులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన పిసిసి రేసులో కూడా ఉన్నారట.
సమాచారం మేరకు... తెలంగాణ పిసిసి రేసులో కెఆర్ సురేష్ రెడ్డి, సీమాంధ్ర పిసిసి రేసులో చిరంజీవి ఉన్నారు. సామాజిక వర్గాల ఆధారంగా బాధ్యతలు ఇచ్చే కట్టబెట్టే అవకాశముంది. ఓ సామాజిక వర్గానికి సిఎం పదవి ఇస్తే, అదే సామాజిక వర్గానికి కాకుండా మరో వర్గానికి పిసిసి అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో దామోదర రాజనర్సింహ, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, సీనియర్ నేతలు జానా రెడ్డి, గీతా రెడ్డిలతో పాటు శాసన మండలి సభ్యులు డి శ్రీనివాస్లు ఉన్నారు. పిసిసి రేసులో తెలంగాణ నుండి సురేష్ రెడ్డి, సీమాంధ్ర నుండి చిరంజీవిలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో చిరంజీవి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూనే సీమాంధ్ర ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని బయటా, సభలో బలమైన వాదన వినిపించారు. అదే సమయంలో ఆయనకు ఎపిలో మంచి ఫాలోయింగ్ ఉంది. రాజకీయ పార్టీలు, నాయకుల విమర్శలు పక్కన పెడితే చిరుకు వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. అంతేకాకుండా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత.
సభలు, సమావేశాలు నిర్వహించినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ జనం వస్తారని కాంగ్రెసు పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో ప్రాంతంలో పార్టీని బతికించుకోవాలంటే చిరంజీవి వంటి ఇమేజ్ ఉన్న నాయకుడికి రాష్ట్రంలో మంచి బాధ్యత ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉందంటున్నారు. అందుకే ఆయనకు పిసిసి చీఫ్ లేదా సిఎం పోస్టు ఇచ్చే విషయమై ఆలోచిస్తోందట. అయితే, సిఎం పదవి రాష్ట్రపతి పాలన లేదా కొత్త ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ఆధారపడి ఉంటుంది.