నిలకడగా జగన్ ఆరోగ్యం: ఫోన్ చేసిన పరామర్శించిన చిరంజీవి
హైదరాబాద్: కత్తి దాడిలో గాయపడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనకు సిటీ న్యూరో ఆస్పత్రి వైద్యులు శనివారం పరీక్షలు నిర్వహించారు.
వైయస్ జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి ఎండీ సాంబాశివారెడ్డి తెలిపారు. గాయం తీవ్రత కారణంగా వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా జగన్కు ఆయన సూచించారు. కత్తిపోటు గాయం నుంచి సేకరించిన రక్త నమూనాలు ల్యాబ్కు పంపించగా.. ఆ రిపోర్టులు వచ్చాయని, బ్లడ్ శాంపిల్స్లో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టులో గుర్తించామని సాంబాశివారెడ్డి తెలిపారు.
విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం జరిగిన హత్యాయత్నం ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ జగన్ని శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే.
జగన్మోహన్ రెడ్డికి చిరంజీవి ఫోన్
వైయస్ జగన్మోహన్ రెడ్డిని శనివారం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పరామర్శించారు. వైయస్ జగన్ను ప్రముఖ హీరో, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరంజీవి ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా వైయస్ జగన్ను ఫోన్లో పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.