హరికృష్ణ ఎదురుపడ్డప్పుడు: చిరంజీవి, నివాళులు అర్పించి ప్రసంగం ప్రారంభించిన జగన్
Recommended Video
హైదరాబాద్: హరికృష్ణ మృతి చాలా దురదృష్టకరమని, తన మనసును కలచివేస్తోందని చిరంజీవి అన్నారు. ఆయన మరణం తనను బాధిస్తోందన్నారు. మెహిదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. నందమూరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడారు.
తన సోదర సమానుడు, ఎంతో ఆప్యాయంగా పలకరించే నందమూరి హరికృష్ణ అకాల మరణం చెందడంతో దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. చాలా బాధగా ఉందని, మనసు కలచివేస్తోందని అన్నారు.
హరికృష్ణ తనకు ఎప్పుడు ఎదురుపడ్డా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారు. సరదాగా జోక్స్ వేస్తూ నవ్వించే వారని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని, వారి ఫ్యామిలీ మనోస్థైర్యంతో ఉండాలని కోరుకున్నారు.
హరికృష్ణకు నివాళి అర్పించి జగన్ ప్రసంగం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పాదయాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. అనకాపల్లి బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభానికి ముందు హరికృష్ణకు నివాళులు అర్పించారు. హరికృష్ణ మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని, ఆయన మృతికి తన సంతాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు.