వెనక ఎవరున్నారో తెలీదు: పవన్ కళ్యాణ్పై చిరంజీవి
హైదరాబాద్: తమ పార్టీపై తన తమ్ముడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, కాంగ్రెసు సీమాంధ్ర ప్రచార రథసారథి చిరంజీవి స్పందించారు. కాంగ్రెసు హఠావో అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన నివాదంపై కూడా ఆయన స్పందించారు. కాంగ్రెసు పార్టీకి 120 ఏళ్ల చరిత్ర ఉందని, కాంగ్రెసును భూస్థాపితం చేస్తామని చాలా మంది అన్నారని, కానీ ఎవరి వల్లా అది కాదని ఆయన అన్నారు.
తాను భారతీయుడిని చెప్పుకోవడానికి అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెసు అని, భారతదేశానికి బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కలిగించిందని ఆయన అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సున్నితమైన వ్యక్తి అని, భావోద్వేగంతో మాట్లాడారని ఆయన అన్నారు. పవన్ వెనక ఎవరున్నారో తెలియదని చెప్పారు.
రాజకీయ పార్టీ గురించి పవన్ కళ్యాణ్ తనతో మాట్లాడలేదని చెప్పారు. తమ్ముడితో తాను ఎందుకు మాట్లాడనని ఆయన ప్రశ్నించారు. విభజన ప్రక్రియలో తొందరపడ్డారని మాత్రమే పవన్ కళ్యాణ్ అన్నాడని ఆయ గుర్తు చేశారు. విభజన విషయంలో అన్ని పార్టీలూ తప్పు చేశాయని, కాంగ్రెసునే నిందించడం తగదని ఆయన అన్నారు. కాంగ్రెనును వేలెత్తి చూపే ముందు మిగతా పార్టీల వైపు కూడా చూడాలని ఆయన అన్నారు.
విభజనకు అనుకూలమని అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్న తర్వాతనే చివరగా కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. మిగతా పార్టీలు సమైక్యం ముసుగులో ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు.
ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చునని, పవన్ కళ్యాణ్కు కూడా ఆ హక్కు ఉందని, అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయమని ఆయన అన్నారు. ఇతరులు పెట్టుకున్నట్లే పవన్ పార్టీ పెట్టుకున్నాడని, ప్రజలకు ఎలా చేస్తాడనేది పవన్ వ్యక్తిగత విషమయని ఆయన అన్నారు. పవన్ పార్టీ సిద్ధాంతమేమిటో, భావజాలం ఏమిటో తనకు అర్థం కాలేదని చిరంజీవి అన్నారు.