చెరొకటి: పెదవి విప్పిన చిరంజీవి, నిలదీసినా పవన్ కళ్యాణ్ మౌనం వెనుక!
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిరంజీవి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో చెరో బాధ్యత నెత్తిన పెట్టుకున్నారు! ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ఎట్టకేలకు చిరంజీవి ఇటీవల బయటకు వచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం హోదా ఇచ్చే వరకు తాము పోరాడుతామని చెప్పారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలోని రైతులకు అండగా నిలబడతానని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్, బీజేపీలు సార్వత్రిక ఎన్నికలకు ముందు పోటీ పడ్డాయి. కానీ, ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీకి అభ్యంతరం లేకపోయినప్పటికీ ఇతర రాష్ట్రాల నేతలు... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో బీజేపీ ఇరుకున పడింది.
ఈ నేపథ్యంలో ఇటీవల బీజేపీ ఎంపీలు విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, కానీ ఎప్పుడు ఇస్తామో చెప్పలేమని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. సార్వత్రిక ఎన్నికలు అయినప్పటి నుండి పెద్దగా కనిపించని చిరంజీవి, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పార్టీ తరఫున పోరాడుతామని బీజేపీని హెచ్చరించారు.
రాష్ట్ర విభజన, అనంతర పరిణామాలకు తాను ప్రత్యక్ష సాక్షిని అని, అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా లేఖలి ఇచ్చాయని, అందుకే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రాజకీయ పార్టీలను ఢిల్లీకి తీసుకు వెళ్లి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. అందుకోసం తాము చంద్రబాబు వెంట నడిచేందుకు సిద్ధమని ప్రకటించారు.
బీజేపీని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే, చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత రైతులకు అండగా నిలిచేందుకు సిద్ధమని ప్రకటించాడు. రాజధాని ప్రాంత రైతుల భూములను బలవంతంగా తీసుకుంటే తాను రోడ్డెక్కుతానని హెచ్చరించారు. అయితే, పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ప్రత్యేక హోదా పైన రాజధాని అంత తీవ్రస్థాయిలో మాట్లాడక పోవడం గమనార్హం.
మొత్తానికి అన్నయ్య చిరంజీవి ప్రధాని నరేంద్ర మోడీ పైన పోరు సల్పుతుంటే, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయమై మాట్లాడాలని ప్రముఖ నటుడు శివాజీ గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం శివాజీ ప్రత్యేక హోదా కోసం గుంటూరులో దీక్ష ప్రారంభించారు.
ఈ సమయంలోను శివాజీ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ తల్చుకుంటే బీజేపీ దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పారు. పవన్ ప్రత్యేక హోదా కోసం బీజేపీని ప్రశ్నించాలని కోరారు.
అయితే, రాజధాని పైన స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన త్వరలో ఘాటుగానే స్పందించవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. సరైన సమయంలో ఆయన స్పందిస్తారని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం మాత్రం పవన్ దీనిపై ట్వీట్ చేశారు. అదే సమయంలో శివాజీ దీక్షలో జనసేన కార్యకర్తలు కూడా పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది.