చేదు అనుభవమే: పవన్ కల్యాణ్ను వీడని చిరంజీవి నీడ
Recommended Video
అమరావతి: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ను అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నీడ వదలడం లేదు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంలో పవన్ కల్యాణ్ పాత్ర ఏమీ లేదు. అయినా దానిపై ఆయన ప్రశ్నలను ఎదుర్కుంటూనే ఉన్నారు.
నిజానికి, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం పవన్ కల్యాణ్కు ఇష్టం లేదు. తన ప్రమేయం లేకుండానే అది జరిగిపోయింది. దానిపై ఆయన సూటిగా మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడినట్లు కనిపించలేదు.
చిరును సిఎంగా చూడాలని...
తన అన్నయ్య చిరంజీవిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని పవన్ కల్యాణ్ అనుకున్నారు. ప్రజారాజ్యం అనుబంధ యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్నికల్లో ఆయన ప్రచారం చేశారు. ఎక్కువగా తెలంగాణలో పర్యటిస్తూ ప్రజలతో కలిసి పోవాలని ప్రయత్నించారు. అయితే, ప్రజారాజ్యం పార్టీకి మాత్రమే కాకుండా పవన్ కల్యాణ్కు కూడా అది చేదు అనుభవంగానే మారిపోయింది. ఆ తర్వాత కాంగ్రెసుతో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం అందరికీ తెలిసిందే.
తాను నిస్సహాయుడిని అని చెప్పినా...
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసే ప్రక్రియ విషయంలో తాను నిస్సహాయుడినని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ సమయంలో తన పాత్ర లేదని నర్మగర్భంగా కూడా చెప్పారు. అయినా ప్రజారాజ్యం పార్టీ విలీనం గురించి ఆయన విమర్శలను ఎదుర్కోక తప్పడం లేదు. తమపై పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలను ఎదుర్కోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజారాజ్యం పార్టీ విలీనాన్ని ముందుకు తెస్తోంది.
ప్రజారాజ్యంలో తన పాత్ర గురించి ఇలా చెప్పారా...
పవన్ కల్యాణ్ని ఫలానా చోటకి ప్రచారానికి పంపించాలని సూచిస్తే ఎందుకండీ.. మనకు అల్లు అర్జున్ ఉన్నాడుగా, రామ్చరణ్ ఉన్నాడుగా.. పంపించేయండి అని అల్లు అరవింద్ అన్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. "అప్పుడు నాకు అర్ధమైంది ఏమిటంటే అల్లు అరవింద్గారు నన్ను నటుడిగానే చూశారు. తన కొడుకుతో పాటు, తన మేనల్లుడితో పాటు పవన్ కల్యాణ్ అనే వాడు ఒక నటుడంతే. అంతేగానీ, వారికి నాలో ఉన్న సామాజిక స్పృహ మాత్రం కనిపించలేదు. ఇలాంటి వాతావరణంలో ఇంక నేను ఏం మాట్లాడితే ఎవరు వింటారండి?" అని సుదీర్ఘ వివరణే ఇచ్చుకున్నారు. అందుకనే చేతులు కట్టుకుని రోధించేవాడినని, కన్నీళ్లు కూడా బయటికి వచ్చేవి కావని పవన్ కల్యాణ్ అన్నారు.
ప్రజారాజ్యంపై రోజా ప్రశ్న ఇలా...
ఏ అనుభవం ఉందని చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టారని, ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏ అనుభవం ఉందని జనసేన పార్టీ పెట్టారని పవన్ కల్యాణ్ ప్రశ్నించడానికి కాదు, ప్యాకేజీల కోసమే జనసేన పార్టీ పెట్టారని రోజా అన్నారు. తన అన్నయ్య చిరంజీవిని మోసం చేసిన వారిని వదిలి పెట్టనని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, కానీ అందులో మీ కుటుంబ సభ్యులే ఉన్నారని రోజా ధ్వజమెత్తారు. ఆ తర్వాత ఇతరులు ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
చిరంజీవి సిఎం అవుతారని....
చిరంజీవి ముఖ్యమంత్రి అవుతాడని భావించి పవన్ కళ్యాణ్ అప్పుడు బాగా ప్రచారం చేశారని రోజా వ్యాఖ్యానించారు. కానీ కేవలం 18 సీట్లు వచ్చి, గెలవకపోయేసరికి పవన్ తన పాటికి తాను సినిమా షూటింగులకు వెళ్లారని ఆరోపించారు. సీట్లు తక్కువ వచ్చినా చిరంజీవి కోసం, ప్రజారాజ్యం కోసం పని చేయలేదని అన్నారు. చిరంజీవిని గాలికి వదిలేశావని వ్యాఖ్యానిచారు.. క్షమించమని నీ అన్నయ్యను వేడుకో అంటూ సలహా ఇచ్చారు.
ఎన్నికల తర్వాత అలా వదిలేశావు....
ఆ రోజు పరుగెత్తుకు వచ్చి యువరాజ్యానికి అధ్యక్షుడిగా వ్యవహరించి, ఎన్నికల తర్వాత చిరంజీవిని వదిలేశావని పవన్ కళ్యాణ్పై రోజా మండిపడ్డారు. అందుకు నిన్ను నీవు శిక్షించుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. మీరందరూ కలిసి చిరంజీవిని నాశనం చేసి ఇంటికి పంపించి, ఈ రోజు ఎవరో చేశారని వాళ్లను వదిలిపెట్టనని చెప్పడం హాస్యాస్పదం అన్నారు.
ప్రజారాజ్యంపై జగన్ ఇలా...
రాజకీయాల్లో అనుభవం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అంటూ ఏ అనుభవం ఉందని ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రజారాజ్యం పార్టీని ప్రజారాజ్యం పార్టీని స్థాపించారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అవినీతిమయమైతే ప్రజా రాజ్యం పార్టీనిఅందులో ఎందుకు విలీనం చేశారని అడిగారు. ఆ విలీనంలో ఎంత అవినీతి జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు.