ఆ కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతులు రాక.... రేపు చిరంజీవి పర్యటన వాయిదా
గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి ఎట్టకేలకు ప్రజలతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు పశ్చిమ గోదావరి జిల్లా రావటానికి సిద్ధం అయ్యారు. అయితే ఆ కార్యక్రమం ప్రభుత్వం నుండి అనుమతి రాక వాయిదా పడింది. తాడేపల్లిగూడెంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన విశ్వనటుడు ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించటానికి రావటానికి ఆయన షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది . హౌసింగ్ బోర్డులో ఏర్పాటు చేసిన ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించటానికి రానున్న చిరంజీవికి ఉభయగోదావరి జిల్లాలలో ఆభిమానులు సాదరంగా ఆహ్వానం పలకటానికి ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నారు. అయితే అనుకోకుండా ఈ కార్యక్రమం వాయిదా పడింది. .
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో నిర్వహించతలపెట్టిన ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు కాబట్టి వాయిదా పడింది. తన సహజసిద్ధమైన నటనతో ఎలాంటి పాత్ర అయినా సరే పరకాయ ప్రవేశం చేసిన గొప్ప నటుడు, హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, పౌరాణిక, సాంఘిక, కుటుంబ కథా చిత్రాల్లో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి, విశ్వనట చక్రవర్తిగా కీర్తి సొంతం చేసుకున్న ఎస్వీ రంగారావును గౌరవించాలన్న ఉద్దేశంతో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్, కె.ఎన్.రోడ్డులో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సేవా సమితి గూడెంలో కొన్ని నెలల కిందటే ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అయితే చిరంజీవితో ఆవిష్కరింప జేయాలని ఎస్వీఆర్ సేవా సమితి సభ్యులు భావించింది. అయితే చిరంజీవి కూడా సైరా షూటింగ్లో బిజీగా ఉండటంతో విగ్రహావిష్కరణ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ విగ్రహాన్ని రేపు మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించాల్సి ఉన్నా ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడం, ఇతరత్రా అనివార్య కారణాలతో కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. త్వరలోనే విగ్రహావిష్కరణకు సంబంధించి కొత్త తేదీ ప్రకటిస్తామని తెలిపారు.