తాడేపల్లి గూడెంలో రేపు చిరంజీవి పర్యటన ... రీజన్ ఇదే
గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవిసైరా సినిమా బిజీలో ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో కూడా ప్రస్తుతం తాను కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ కోసం కూడా ప్రచారం చెయ్యని చిరంజీవి రాజకీయాల గురించి ఎక్కడా కూడా మాట్లాడటం లేదు . ఇక తాజాగా ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్న నేపధ్యంలో ఆయన ఏమైనా మాట్లాడతారా అన్న ఆసక్తి నెలకొంది.
పోలవరం రివర్స్ టెండరింగ్ పై కేంద్రానికి పీపీఏ నివేదిక ..ఏపీ ప్రభుత్వ నిర్ణయాలతో నష్టం అంటూ రిపోర్ట్
పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు చిరంజీవి తాడేపల్లి గూడెం చేరుకోనున్నారు. ప్రత్యేక జెట్ విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకుంటారు చిరంజీవి. అక్కడ నుంచి కారులో తాడేపల్లిగూడెం వస్తారు. ఇక అక్కడ విశ్వనటుడు ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. హౌసింగ్ బోర్డులో ఏర్పాటు చేసిన ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించటానికి రానున్న చిరంజీవికి ఉభయగోదావరి జిల్లాలలో బాగా క్రేజ్ ఉంది.
తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సేవా సమితి గూడెంలో కొన్ని నెలల కిందటే ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అయితే చిరంజీవితో ఆవిష్కరింప జేయాలని ఎస్వీఆర్ సేవా సమితి సభ్యులు భావించింది. అయితే చిరంజీవి కూడా సైరా షూటింగ్లో బిజీగా ఉండటంతో విగ్రహావిష్కరణ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ మధ్య కొద్దిరోజుల కిందట హైదరాబాద్ వెళ్లి ఎస్వీఆర్ సేవా సమితి సభ్యులు నేరుగా చిరంజీవిని ఆహ్వానించారు. దీనికి సానుకూలంగా స్పందించిన చిరంజీవి రేపు తాడేపల్లి గూడెం చేరుకొని రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.