తమ్ముడి సంగతి తెలియదు..! : కాపు నేతల భేటిలో పవన్ పై చిరు..
హైదరాబాద్ : మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ సెగ తగలడం ఎప్పటినుంచో మొదలైంది. ప్రత్యేకించి చిరంజీవికి ఇదొక ఇబ్బందికర పరిణామంగా తయారైంది. సినిమా వేదికల మీదే గాక రాజకీయాంశంల్లోను తమ్ముడి ప్రస్తావనకు బదులివ్వాల్సి రావడం ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా, కాపు సామాజిక వర్గ నేతగా ఉన్న చిరంజీవిని ఇరకాటంలో పెడుతున్న అంశం.
ఏపీలో ముద్రగడ దీక్ష నేపథ్యంలో.. కాపులంతా ఒక్క తాటిపైకి వచ్చి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు మద్దతు తెలుపుతుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. కాగా, దీనిపై కాపులంతా పవన్ కళ్యాణ్ వైపు వేలేత్తి చూపుతుంటే, సోమవారం నాడు జరిగిన కాపు నేతల భేటీలో పవన్ కళ్యాణ్ గురించి కాపు నేతలు చిరంజీవిని ప్రశ్నించడం ఆయన్ను ఇబ్బందిపెట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భేటీలో భాగంగా పవన్ కళ్యాణ్ వ్యవహారంపై అభ్యంతరం తెలుపుతూ.. 'జనసేన అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదని' చిరంజీవిని కాపు నేతలు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దీనిపై సున్నితంగా స్పందించిన చిరంజీవి, పవన్ విషయం తనకు తెలియదని సమాధానమిచ్చారట. దీంతో సమాధానం దాటేవేశారనే ప్రయత్నం చేశారని కొందరు వాదిస్తుంటే, మరికొంత మంది మాత్రం ఆలస్యమైనా పవన్ స్పందించే అవకాశం లేకపోలేదంటూ వేచి చూసే ధోరణిలో మాట్లాడినట్టుగా సమాచారం.
ఇక పవన్ కళ్యాణ్ గురించి అడిగినప్రశ్నకు బదులిచ్చే క్రమంలో తమ్ముడి విషయం తనకు తెలియదన్న చిరంజీవి, తాను మాత్రం మిగతా కాపు నేతల్లాగే కాపుల ప్రయోజనాల కోసం ముందున్నానని చెప్పుకొచ్చారట. ఏదైమైనా పవన్ కళ్యాణ్ వ్యవహారం ఇప్పుడు చిరంజీవికి కొత్త ఇబ్బందుల్ని స్రుష్టిస్తోందన్న చర్చ జరుగుతుంది.