నేనేం మాట్లాడగలను, శివాజ్ఞగా భావిస్తున్నా: చిరంజీవి ఉద్వేగం
అతిరుద్ర యాగంలో తాను పాల్గొనడాన్ని సాక్షాత్తు శివయ్య ఆజ్ఞగా భావిస్తున్నట్లు కాంగ్రెసు నేత, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తానేం మాట్లాడగలనని అన్నారు.
శ్రీకాళహస్తి: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి ముక్కంటీశుని ఆలయ గోపుర నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగంలో పాల్గొనడం సాక్షాత్తు ఆ శివయ్య ఆజ్ఞగా భావించి వచ్చానని, ఇది తన పూర్వ జన్మసుకృతమని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి ఉద్వేగంగా అన్నారు.
శ్రీకాళహస్తిలో అతిరుద్ర మహాయాగాలలో ఆదివారం చిరంజీవి దంపతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంతమంది సరస్వతీ పుత్రులు, జ్ఞాన సంపన్నులు, పెద్దలు ఈ మహాయాగాల్లో పాల్గొని ఎన్నో ప్రవచనాలు చేశారని, వారి సమక్షంలో తాను ఏమి మాట్లాడగలనని, ఏమి మాట్లాడి మిమ్మల్ని సంతోషపెట్టగలనని, ఈ యాగంలో పాల్గొనేందుకు ఆహ్వానించిన నవయుగ నిర్మాణ సంస్థ చైర్మన్ విశ్వేశ్వరయ్యకు కృతజ్ఞతలు చెప్పడం తప్ప అని ఉద్వేగంగా అన్నారు.
రెండు నెలల క్రితం విశ్వేశ్వరయ్య తాము నిర్వహించనున్న యాగాల్లో పాల్గొనాలని ఆహ్వానించినప్పుడు తన శరీరం పులకించిందని, ఇది శివయ్య ఆజ్ఞగా భావించి వచ్చానని అన్నారు. రాజగోపురం కూలిపోయినప్పుడు తాను స్వయంగా వచ్చి చూసి చలించిపోయానని అన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్యను రాజగోపుర నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని కోరానని చెప్పారు.
ఆ సమయంలో నిర్మాణ రంగంలో విశేష అనుభవం కలిగిన నవయుగ నిర్మాణ సంస్థ చైర్మన్ విశ్వేశ్వరయ్య ముందుకొచ్చారని అన్నారు. 16వ శతాబ్దంలో రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మిస్తే నేడు విశ్వేశ్వరయ్య ఆ గోపురాన్ని పునర్ నిర్మాణం చేపట్టి అభినవ శ్రీకృష్ణదేవరాయలు అయ్యారని అన్నారు.
ఇలాంటి కార్యక్రమాల్లో కర్త, కర్మ, క్రియ అంతా లయకారకుడైన ఆ శివుడే అన్నారు. ఇక విశ్వేశ్వరయ్య సుసంపన్నుడైనా ఆయన వినయవిధేయతలు చూస్తే ఎదిగేకొద్ది ఒదగాలనే నానుడి తనకు గుర్తుకు వస్తుందన్నారు.