తొందరొద్దని చిరంజీవి: కసి ఉంది, గెలవమని నేతల గోడు
హైదరాబాద్: తాజా పరిణామాల నేపథ్యంలో ఎవరు కూడా తొందరపడవద్దని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తమకు సూచించారని పూర్వ ప్రజారాజ్యం పార్టీ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం, అసెంబ్లీకి బిల్లు రావడంతో సీమాంధ్ర కాంగ్రెసు నేతలు ఇతర పార్టీలలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో చిరు తన నివాసంలో పూర్వ పిఆర్పీ ఎమ్మెల్యేలు, మంత్రులు శుక్రవారం భేటీ అయ్యారు.
అనంతరం పలువురు నేతలు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన, తాజా రాజకీయ పరిస్థితుల పైన భేటీలో చర్చించామని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. రాష్ట్ర సమైక్యత కోసం గట్టిగా కృషి చేయాలని చిరు తమతో చెప్పారని, ఎవరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారన్నారు.
పలువురు నేతలు పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో దానిపై చర్చించామని కన్నబాబు అన్నారు. ఈ నెల 23వ తేదీ లోపు మరోసారి సమావేశమవుతామన్నారు. ఎవరు కూడా పార్టీలు మారడం లేదని మంత్రి సి రామచంద్రయ్య అన్నారు. నియోజకవర్గంలోని తాజా పరిస్థితులను తాము వివరించామన్నారు.
గోడు వెళ్లబోసుకున్న నేతలు
పూర్వ పిఆర్పీ నాయకులు చిరు ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారట. విభజన నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ పైన ప్రజలు కసి పెంచుకున్నారని, వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. కాంగ్రెసు పార్టీలోనే ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారట. కాంగ్రెసు పార్టీని అందరూ ఉమ్మడి శత్రువుగా చూస్తున్నారని, కేడరంతా పార్టీ మారుదామని సూచించారట. అయితే, చిరు మాత్రం ఎవరు తొందరపడవద్దని సూచించారట.