చిరంజీవి పుష్కర స్నానం, చూసేందుకు పోటీ, సినిమా స్టైల్ డైలాగ్: కళా
రాజమండ్రి: ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి బుధవారం నాడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని సరస్వతీ ఘాట్లో పుష్కర స్నానం ఆచరించారు. చిరంజీవితో పాటు అల్లు అరవింద్, అల్లు అరవింద్ తదితరులు పుణ్య స్నానాలు ఆచరించారు.
వారు పితృ దేవతలకు పిండ ప్రదానం చేశారు. పుష్కరాలకు పవిత్ర స్నానం చేసేందుకు వచ్చిన చిరంజీవిని చూసేందుకు భక్తులు, అభిమానులు పోటీ పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు అందర్నీ నిలువరించారు.
కాగా, పుణ్యస్నానాలు ఆచరిస్తున్న వారితో రాజమండ్రి గోదావరి తీరం వద్ద సందడి నెలకొంది. పుష్కరాల సందర్భంగా మహిళలు గోదారి తల్లికి సారె సమర్పించారు. పుష్కరాలు ఇంకా మూడు రోజులో ఉండటంతో పుష్కర స్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో పుష్కరఘాట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. పుష్కరాలకు ప్రధాన కేంద్రమైన రాజమండ్రిలోని పుష్కర ఘాట్, కోటిలింగాలరేవు ఘాట్ల వద్ద రద్దీ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు వీఐపీ ఘాట్ వద్ద పుష్కర స్నానమాచరించారు.
పురపాలక మంత్రి నారాయణ పుష్కరఘాట్ల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజమండ్రితో పాటు కోటిపల్లిరేవు, మురమళ్ల, అంతర్వేది, కుండలేశ్వరం, ముక్తేశ్వరం, రావులపాలెం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొవ్వూరు, నరసాపురం తదితర ప్రాంతాల్లోని పుష్కరఘాట్లన్నీ భక్తులతో రద్దీగా మారాయి.
రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురంలో వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తులు వర్షంలోనే పుష్కరస్నానం చేశారు. వర్షపు నీటితో రహదారులు బురదమయంగా మారడంతో పుష్కర ఘాట్లకు, అక్కడి నుంచి దేవాలయాలకు చేరుకునేందుకు భక్తులు అవస్థలు పడుతున్నారు.
సీడ్ క్యాపిటల్: జగన్ పార్టీపై కళా వెంకట్రావు మండిపాటు
ఏపీ సీడ్ క్యాపిటల్ పైన అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత కళా వెంకట్రావు బుధవారం మండిపడ్డారు. కొత్త రాజధాని ఏర్పాటులో ప్రతిపక్షం సహకరించాల్సిందన్నారు. కానీ విమర్శలు గుప్పించడం విడ్డూరమన్నారు. అదే సమయంలో ఓ నాయకుడు సినిమా స్టైలులో డైలాగ్స్ పేలుస్తున్నారన్నారు.