నాలుక కూడా గీస్కోలేం: మోడీ, బాబులని ఏకేసిన చిరు
విజయవాడ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి శనివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పైన దుమ్మెత్తి పోశారు. విజయవాడలో ఆయన పత్రికా సమావేశంలో మాట్లాడారు. పార్టీ నుండి అవకాశవాదులు వెళ్లిపోవడం వల్ల కొత్త వారికి అవకాశం దొరికిందన్నారు. అత్యున్నత పదవిని అనుభవించి పార్టీని మోసగించిన వ్యక్తి కిరణ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రజల్లో కాంగ్రెసు పార్టీకి మంచి ఆదరణ ఉందన్నారు. ప్రజలకు కాంగ్రెసు పట్ల అభిమానం ఉందని చెప్పారు. కిరణ్ ఆఖరి వరకు పదవులు అనుభవించి ఇప్పుడు చేస్తున్న ప్రచారం ప్రజలలో గందరగోళం సృష్టిస్తోందన్నారు. అధికారంలోకి రావాలనే విపక్షాలు కాంగ్రెసు పార్టీ పైన అవాస్తవాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.
నరేంద్ర మోడీ ప్రమాదకరమైన వ్యక్తి అన్నారు. మనకు వ్యక్తి ముఖ్యం కాదని వ్యవస్థ ముఖ్యమన్నారు. అల్లకల్లోహాలు సృష్టించే వ్యక్తి మనకు అవసరమా అన్నారు. మోడీ బిజెపినే కబ్జా చేశారని నిప్పులు చెరిగారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలది అధికార దాహమన్నారు. బాబు బిసి డిక్లరేషన్ నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదన్నారు. టిడిపిలో సామాజిక న్యాయం లేదన్నారు. సిట్టింగ్ను పక్కన పెట్టి తన బావమరిదికి టిక్కెట్ ఇచ్చారన్నారు.
బిజెపితో పొత్తు చారిత్రక తప్పిదమని, గ్దోరా అల్లర్లను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు ఇప్పుడు బిజెపితో పొత్తు పెట్టుకోవడం విడ్డూరమన్నారు. మోడీ ఎంతో ప్రమాదకరమైన వ్యక్తి అన్నారు. విభజనపై తాము ప్రజలకు వాస్తవాలను వివరిస్తామన్నారు. పదేళ్లలో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మిస్తామన్నారు.
విభజన తర్వాత జరిగే అభివృద్ధి ద్వారా ప్రజలు నిజాలు తెలుసుకుంటారన్నారు. సీమాంధ్రుల్లో ఎలాంటి భయాందోళనలు, భావోద్వేగాలు అవసరం లేదన్నారు. కిరణ్ అందర్నీ మభ్య పెట్టి తన పదవిని కాపాడుకున్నారన్నారు. విభజనకు సహకరించిన కిరణ్ కుమార్ రెడ్డికి తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. విభజన జరుగుతుందని తెలిసినా చివరి వరకు గోప్యంగా ఉంచారని ధ్వజమెత్తారు.