చిరు సినిమాలో తెలుగు రైతుల ఆత్మహత్యలు: టార్గెట్ చంద్రబాబు, కెసిఆర్?
తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150పై రాజకీయ నీడ పడకుండా చిరంజీవి జాగ్రత్త పడినట్లు కనిపిస్తున్నారు. రాజకీయంగా దాన్ని వాడుకోవాలనే ఉద్దేశం లేనట్లే ఆయన వ్యవహరించారు. అయితే...
హైదరాబాద్: తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150 విషయంలో కాంగ్రెసు నేత, మెగాస్టార్ చిరంజీవి బహు జాగ్రత్తగా వ్యవహరించినట్లు కనిపిస్తున్నారు. నిజానికి, ప్రస్తుత పరిస్థితిలో చిరంజీవి సినిమాల్లో తిరిగి నటిస్తున్నారంటే, ఆయన నటించే సినిమా రాజకీయరంగును పులుముకోవాల్సి ఉండింది. కానీ అలా జరగలేదు. సినిమా వేరు, రాజకీయాలు వేరనే పద్ధతిలోనే ఆయన వ్యవహారం నడుపుతూ వచ్చారు.
సినిమాలో పాత్రలు ఎవరెవరికి ప్రాతినిధ్యం వహిస్తాయనే చర్చ కూడా జరగలేదు. తన సినిమా ప్రీరిలీజింగ్ ఫంక్షన్కు తొలుత అనుమతి ఇవ్వకపోవడంపై కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆ రకంగా సినిమా విషయంలో పూర్తి జాగ్రత్త తీసుకుంటూ వచ్చినట్లు కనిపించారు. ఖైదీ నంబర్ 150 మీ పొలిటికల్ లైఫ్కు ఏ మాత్రం ఉపయోగపడుతుందనే ప్రశ్నకు కూడా ఆయన చాలా సమతుల్యమైన జవాబు ఇచ్చారు.
"దేశంలో నెలకొన్న సమస్యలకు వాస్తవరూపంగా ఈ సినిమా ఉంటుంది. గత పదేళ్లలో రైతులు ఎంత మంది చనిపోయారు? అందులో తెలుగు వారెందరు ఉన్నారు? అనే లెక్కలను యదార్థంగా ఇందులో ఆవిష్కరించాం. కోట్ల రూపాయల్ని ఎగవేసిన కార్పొరేట్ సంస్థల వ్యాపారులు సంతోషంగా గడుపుతుంటే కొద్దిపాటి అప్పులు కట్టలేని రైతులు పురుగుల మందులు తాగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాటికి గల కారణాల్ని హృద్యంగా సినిమాలో చూపించాం. రైతుల సమస్యలను ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోవడానికి ఈ చిత్రం చక్కటి వారధిగా నిలుస్తుందని అనుకుంటున్నాను" అని ఆయన సమాధానం ఇచ్చారు.
దేశంలోని రైతుల పరిస్థితిని రూపుకట్టిన ఈ సినిమాలో తెలుగు రైతుల ఆత్మహత్యల గురించి కూడా ఉందంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యల లెక్కలు కూడా ఉంటాయా అనేది చూడాల్సి ఉంది. ఆ రకంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాలనపై విసుర్లు కూడా ఉంటాయా అనేది కూడా ఆసక్తికరంగానే మారింది. అయితే, కార్పోరేట్ సంస్థల విధ్వంసం గురించి, ఆ సంస్థలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్న వైనం గురించి ప్రధానంగా ఉంటుందనేది అర్థమవుతోంది.
సినిమాపై ఏ విధమైన రాజకీయ నీడ పడకుండా జాగ్రత్త పడుతూనే తన రాజకీయ జీవితానికి పనికి వచ్చే విధంగా సినిమాను తీర్చి దిద్దుకున్నారా అనేది కూడా చూడాల్సి ఉంది. సినిమా ప్రమోషన్ కోసం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన రాజకీయాలు మాట్లాడారు. నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దుపై విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాటం చేయకపోవడం గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. కానీ అవి అంత ఘాటుగా లేవు.
తెలుగుదేశం పార్టీ గానీ బిజెపి గానీ చిరంజీవి వ్యాఖ్యలపై ఎక్కడా స్పందించలేదు. అలా స్పందించకపోవడం వెనక కారణం ఏమిటనేది కూడా తెలియడం లేదు. పదేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తున్న చిరంజీవికి మంచి స్వాగతమే లభిస్తోందని చెప్పుకోవాలి. సినిమా విడుదలైతే గానీ కెసిఆర్, చంద్రబాబుల మీద విసుర్లున్నాయా లేదా అనేది తెలియదు. నరేంద్ర మోడీని, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఏ మేరకు టార్గెట్ చేశారు అనేది కూడా అప్పుడే తెలుస్తోంది. మొత్తం మీద, రైతుల పరిస్థితిపై ఆయన ఆలోచన రేకెత్తించే సినిమాగానే ఇప్పటి వరకు ఖైదీ నంబర్ 150 ప్రచారం పొందుతోంది.