ఏపీలో సైరా కొత్త బాధ్యతలు..సీఎం ముందు ప్రతిపాదన: జగన్ సైతం సై: త్వరలో మరో భేటీ..!
మెగాస్టార్ చిరంజీవి దంపతులకు ముఖ్యమంత్రి జగన్ నివాసం లో ఆత్మీయ ఆహ్వానం లభించింది. కుటుంబ సభ్యులతో గడిపిన అనుభూతి కలిగిందంటూ స్వయంగా చిరంజీవి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలిసి..ఆయనను అభినందించే అవకాశం కలిగిందంటూ సైరా సంతోషం వ్యక్తం చేసారు. సైరా సినిమా చూడాలని వ్యక్తిగతంగా ఆయన్ను ఆహ్వానిద్దామని అనుకున్నాను. ఇంతలో ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసారు. వెంటనే స్పందించారు. సతీ సమేతంగా రావాలి..మధ్నాహ్నం మాతో కొంత సమయం గడపాలి అని సీఎం కోరారని చెప్పుకొచ్చారు.
అయితే, అందరూ ఆసక్తిగా చూసిన ఈ భేటీలో చిరంజీవి ఒక అంశాన్ని ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించారు. చొరవ తీసుకోవాలని జగన్ ను కోరారు. అంతే..వెంటనే జగన్ సైతం స్పందించారు. ఆ బాధ్యతను చిరంజీవికే అప్పగించారు. దీంతో..త్వరలోనే మరో భేటీ ఖాయంగా కనిపిస్తోంది. అయితే..ఈ సారి భేటీలో చిరంజీవితో పాటుగా మరి కొందరు సినీ పెద్దలు రానున్నారు.
సీఎం జగన్ తో చిరంజీవి భేటీ: ముహూర్తం ఖరారు: సమావేశం ఎందుకంటే..!
కుటుంబ సభ్యులతో గడిపిన అనుభూతి..
ముఖ్యమంత్రి పైన మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు గుప్పించారు. అమరావతిలో సీఎం తో చిరంజీవి దంపతులు విందు సమావేశానికి హాజరయ్యారు. ఆ సమయంలోనే అనేక విషయాలు చర్చకు వచ్చాయి. రాజకీయాలకు అతీతంగా ఈ చర్చలు సాగాయి. సినీ పరిశ్రమ..వ్యక్తిగత విషయాలకే వీరిద్దరూ పరిమితమయ్యారు. ఆ సమయంలో సినిమా పరిశ్రమ రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చెందాలని, ఎంతో మందికి ఉపాధిని కల్పించాలని సీఎం జగన్ ఆకాంక్షించారని చిరంజీవి చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని చెప్పటం పైన సంతోషం వ్యక్తం చేసారు. ఇండస్ట్రీకి ఏది కావాలననా తానెప్పుడూ ముందుంటానని జగన్ హామీ ఇచ్చారని..ఏది కావాలననా అడగటానికి ఏ మాత్రం సంకోచించాల్సిన అవసరం లేదని చెప్పారంటూ చిరంజీవి చెప్పారు. సీఎం చెప్పిన విషయాలు తనకు సంతోషాన్ని ఇచ్చాయని..అదే విధంగా కుటుంబ సభ్యులతో గడిపిన అనుభూతి కలిగిందని చిరంజీవి పేర్కొన్నారు.
ఐ ఫీల్ ఇట్స్ ఏ హానర్..
జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తాను రావాలని భావించానని చిరంజీవి తన మనసులో మాట బయట పెట్టారు. ఇప్పుడు తాను నటించిన సైరా సినిమా చూడాలని వ్యక్తిగతంగా ఆయన్ను ఆహ్వానిద్దామని అనుకున్నానని..అయితే ముఖ్యమంత్రి వేగంగా స్పందించి మీరు సతీ సమేతంగా రావాలంటూ కోరటంతో పాటుగా..జగన్ సతీమణి భారతి సైతం ఆహ్వానించారని చెప్పారు. మధ్యాహ్న సమయంలో కొంత టైం మాతో గడపాలని కోరారని చిరు వివరించారు. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఐ ఫీల్ ఇట్స్ ఏ హానర్. ఎంతో ప్రేమతో.. సోదర వాత్సల్యంతో వైఎస్ భారతి కూడా మమ్మల్ని ఆహ్వానించారు...అంటూ చిరంజీవి సంతోషం వ్యక్తం చేసారు. సమావేశం ముగిసిన తరువాత జగన్ దంపతులు కారు వరకూ వచ్చి చిరంజీవి దంపతులకు వీడ్కోలు పలికారు.
చిరంజీవికి కొత్త బాధ్యతలు..సై అన్న జగన్
విందు సమయంలో చిరంజీవి తన మనసులో మాటను ముఖ్యమంత్రి వద్ద బయట పెట్టారు. గత ప్రభుత్వం రెండేళ్లుగా నంది అవార్డులను ప్రకటిస్తున్నా వాటిని అందించలేదని ప్రస్తావించారు. దీనీ పైన మీరు చొరవ తీసుకోవాలని సీఎం ను కోరారు. వెంటనే సీఎం సానుకూలంగా స్పందిస్తూ తమ ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ నుండి కొందరు పెద్దలు కలవాలని అనుకుంటున్నారని చిరంజీవి చెప్పగా.. ఎనీ టైం అన్నా..ఖచ్చితంగా అందర్నీ కలుస్తాను..మీరే లీడ్ చేయండి..సమయం తీసుకొని సమావేశం ఏర్పాటు చేయండి అని చిరంజీవికే ఆ బాధ్యత అప్పగించారు. దీనికి చిరంజీవి సైతం త్వరలోనే సమావేశం అయ్యేలా చూస్తానని చెప్పుకొచ్చారు. దీని ద్వారా తొలి సారి సమావేశంలోనే చిరంజీవి తన ఇండస్ట్రీ ప్రముఖులను జగన్ వద్దకు తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నారు. ఇది ఇప్పుడు రాజకీయంగానే కాకుండా..సినీ పరిశ్రమలోనూ ఆసక్తి కరంగా మారింది.