రాష్ట్రపతి ఎన్నిక: తొలి ఓటు చిరంజీవిదే, మరో విశేషం కూడా..
రాష్ట్రపతి ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీ వ్యూహ ప్రతివ్యూహాల మధ్య జులై 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీ వ్యూహ ప్రతివ్యూహాల మధ్య జులై 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఎన్డీఏ, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు.
తొలి ఓటు చిరంజీవిదే
ఓటింగ్ కోసం మొత్తం రాజ్యసభ, లోక్సభ ఎంపీలు, ఆయా రాష్ట్రాల శాసనసభ్యుల పేర్లను అక్షర క్రమంలో పొందుపర్చి తాజాగా ఎలక్ట్రోరల్ కాలేజి జాబితా విడుదల చేశారు. కాగా, ఇందులో మొదటి పేరు కాంగ్రెస్ పార్లమెంటుసభ్యుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిదే కావడం విశేషం. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటరుగా చిరంజీవి ఓటు వేయనున్నారు.
మరో విశేషం
ఇక ఈ జాబితాలో చివరి పేరు కూడా తెలుగువారిదే కావడం మరో విశేషం. పాండిచ్చేరి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్లాది కృష్ణారావు చిట్టచివరిదైన 4896వ స్థానంలో ఉన్నారు.
చిరంజీవి ఓటు ఎవరికి?
గత కొంతకాలంగా రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీకి దూరంగా మెలుగుతున్న చిరంజీవి ఎవరికి ఓటేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే, ఇప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని చిరంజీవి పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే కాగా, లోక్సభ స్పీకర్గా పనిచేసిన కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి నేతృత్వం వహించారు.
విస్తృత ప్రచారం: కోవింద్ ఎన్నిక లాంఛనమే..
కాగా, ఎన్డీఏ అభ్యర్థిగా బీహార్ మాజీ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పటికే తన అభ్యర్థిత్వానికి మద్దతు పలికిన పార్టీ నేతలతోపాటు సమావేశమవుతున్నారు. మీరా కుమార్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, మెజార్టీ ఓట్లు ఎన్డీఏ కూటమికే ఉండటంతో రామ్ నాథ్ గెలుపు లాంఛనమేనని తెలుస్తోంది.