చిరంజీవి సంచలన ప్రకటన: జగన్కే మద్దతు..సీఎంపై పూర్తి నమ్మకం ఉంది
ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితులు..రాజధానుల వ్యవహారం పైన కేంద్ర మాజీ మంత్రి..ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్పందించారు. అధికార..పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ది సాధ్యమనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేసారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృధికి ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉందని చిరు వ్యాఖ్యానించారు. అమరావతి లో శాసన నిర్వాహక .. విశాఖపట్నం లో కార్యనిర్వాహక.. కర్నూల్ లో న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలంటూ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు.
ఏపీలో మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు..జీఎన్ రావు కమిటీ నివేదిక..అమరావతిలో రైతుల ఆందోళన కొనసాగున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఆలోచనల పైన కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్దికై నిపుణుల కమిటి సిఫార్సులు సామాజిక.. ఆర్ధిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయంటూ పేర్కొన్నారు. గత అభివృద్ధి ..పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందినే విషయాన్ని గుర్తు చేసారు. ఉమ్మడి రాష్ట్రంలో మిగితా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే ఆర్దిక.. సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయని చిరంజీవి విశ్లేషించారు. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో లక్షకోట్లు అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర.. రాయలసీమ పరిస్ధితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉందని చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలతో ఏకీభవించారు.
సాగు-తాగు నీరు.. ఉపాధి అవకాశాలు లేక ఊర్లు విడిచిపోతున్న వలుస కూలీల బిడ్డల భవిష్యత్ కు.. నిరుద్యోగులకు మూడు రాజధానుల కాన్సెప్ట్ భద్రతనిస్తుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేసారు...ఇదే సమయంలో రాజధాని రైతులలో నెలకొన్న భయాందోళనలు ..అభద్రతాభావాన్ని తొలగించాలని చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి సూచించారు. వాళ్లు నష్టపోకుండా.. న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ..మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపోహలు.. అపార్దాలు నివారించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని చిరంజీవి ప్రభుత్వానికి సూచించారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం మీద రాజకీయంగా భిన్న వాదనలు వ్యక్తం అవుతున్న పరిస్థితుల్లో చిరంజీవి స్పందన పైన పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.