పార్టీలో మనం ఉండకపోవచ్చు.! కానీ పార్టీలో మన ఉనికి శాశ్వతం కావాలి! గంటా కి చిరు హితబోధ!
విశాఖపట్టణం/హైదరాబాద్ : చరిత్రలో మనం ఉండకపోచ్చు..! కాని చరిత్ర మనతోనే మొదలు కావాలి..! అనే డైలాగ్ తో సైరా సినిమాలో ఎంతో మందిలో స్పూర్తిని నింపారు చిరంజీవి. ఇప్పుడు అదే స్పూర్తిని రాజకీయ నేతల్లో నింపుతున్నారు మెగాస్టార్. ఎప్పటినుంచో పార్టీ మారేందుకు ఊగిసలాడుతున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అయోమయాన్ని మెగాస్టార్ చిరంజీవి దూరం చేసారు. పార్టీ మారితే వచ్చే నష్టాలేంటి.. పార్టీ మారకుండా ఉంటే కలిగే ప్రయోజనాలేంటో గంటాకు చిరంజీవి హితబోధ చేసినట్టు తెలుస్తోంది. దీంతో గంట మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ గంటా శ్రీనివాస రావుకు సైరా నరసింహారెడ్డి ఏం చెప్పారు..?
మాజీ మంత్రి గంటా కొత్త ట్విస్ట్: చిరుతోనూ సన్నిహితంగా : వైసీపీ కండీషన్లు అవే..అందుకే..!
మనసు మార్చుకున్న గంటా.. పార్టీ మారే నిర్ణయానికి ఇక టాటా..
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజకీయ ప్రస్థానానికి సంబంధించి యూటర్న్ తీసుకున్నారా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నిన్నటి మొన్నటి వరకు గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యాడని, అందుకు ఎంపీ విజయసాయి రెడ్డితో మంతనాలు పూర్తయ్యాయని, సీఎం జగన్ కూడా సానుకూలంగా ఉన్నారనే చర్చ కూడా సాగింది. సోషల్ మీడియాలో గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగింది. కానీ అనుకోకుండా గంటా మనస్సు మార్చుకున్నట్టు తెలుస్తోంది. దాని వెనక సైరా నర్సింహారెడ్డి చక్రం తిప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
గంటా మైండ్ సెట్ మార్చిన చిరంజీవి.. సై సైరా అన్న భీమిలి ఎమ్మెల్యే..
గంటా విషయంలో ఏం జరిగిందో తెలియదు కాని మెగాస్టార్ చిరంజీవిని కలిసిన వెంటనే వైసీపీలో చేరే విషయంలో మనసు మార్చుకుని టీడీపీలోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకు నిదర్శనంగా గంటా శ్రీనివాసరావు గురువారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరై అందరికి షాక్ ఇచ్చారు. గత కొంత కాలంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళతారనే చర్చ జరిగింది. అందుకు సీఎం జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే కథనాలు మీడియాలో వచ్చాయి. కానీ షరతులు వర్తిస్తాయి అనే ట్యాగ్ను ఆలస్యంగా చూడటం, అందుకు చిరంజీవి కొన్ని సూచనలు చేయడం వంటి వ్యవహారాలు గంటా అంశంలో కీలక పాత్ర పోషించినట్టు సమాచారం.
ఎస్వీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న మెగాస్టార్, గంట.. రాజకీయాలపై కీలక చర్చలు..
అయితే పార్టీ లోకి వచ్చే ఎవరికైనా కొన్ని కండీషన్లను పెడుతున్నారు ఏపి సీఎం. గంటా కు కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జగన్ కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే గంటా వైసీపీలోకి వస్తున్నట్టు సంకేతాలు రావడంతో మంత్రి అవంతి శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావుపై విమర్శలకు తెర తీసారు. వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు. అయితే దీనికి ప్రతిగా గంటా అవంతికి భారీ కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే తాడేపల్లిగూడెంలో జరిగిన మహానటుడు ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ గంటా రాజకీయ ప్రస్తానాన్ని మలుపుతిప్పినట్టు చర్చ జరుగుతోంది. ఎస్వీఆర్ విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. చిరంజీవితో పాటు గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. అసలు ట్విస్టు ఇక్కడే మొదలయినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతానికి పార్టీ మారేది లేదు.. యాక్టివ్ రాజకీయాలవైపు గంట చూపు..
చిరంజీవితో చాలా సేపు గడిపిన గంటా రాజకీయ చర్చలు జరిపినట్టు వార్తలు వెలువడుతున్నాయి. మెగాస్టార్ సూచన మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయొద్దని గంటా నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీంతో తన ఆప్తమిత్రుడు అయిన చిరంజీవి మాటను కాదలనలేక గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఆయన టీడీపీ సమన్వయ సమావేశానికి హాజరై అందరికి ఇవే సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు టీడీపీలోనే కొనసాగే గంటా శ్రీనివాసరావు ఇక టీడీపీ సమావేశాలకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలు ఖరారయ్యాయి. ఈ నెల 10, 11న విశాఖ జిల్లా, 21, 22న శ్రీకాకుళం జిల్లాలో బాబు పర్యటించనున్నారు. దీంతో గంటా పార్టీ పరంగా యాక్టివ్ కానున్నారని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి టీడిపిలో జైచిరంజీవ హితబోధ తారకమంత్రంలా పనిచేసినట్టు చర్చ జరుగుతోంది.