కొత్త ట్విస్ట్, కాంగ్రెస్కు చిరంజీవి ప్రచారం: పవన్ కళ్యాణ్కు షాకిస్తారా, జనసేనకు భారీ దెబ్బ?
అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారా? తన తమ్ముడు పవన్ కళ్యాణ్ సొంత పార్టీ జనసేనతో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ చిరంజీవి కాంగ్రెస్ తరఫున ప్రచార బరిలో నిలవనున్నారా? అంటే అవుననే అంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు.
చిరంజీవి ప్రచారానికి వస్తారు
చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి చెప్పారు. చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారన్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగానే తమ పార్టీ సమావేశాలకు హాజరుకావడం లేదని చెప్పారు. ఎన్నికలలో ప్రచారానికి మాత్రం చిరంజీవి తప్పక వస్తారని చెప్పారు.
పవన్ కళ్యాణ్ దెబ్బ! చంద్రబాబు ఎందుకలా మాట్లాడారు?: కొత్త అనుమానాలు
జనసేనలో క్లారిటీ లేదు
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని రఘువీరా రెడ్డి చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి లాంటి బలమైన నాయకుడు ఇప్పుడున్న ఏ పార్టీలోనూ లేరని చెప్పారు. అయన ఎప్పటికీ కాంగ్రెస్ వ్యక్తే అన్నారు. జనసేనలో ఇంతవరకూ ఓ క్లారిటీ లేదని విమర్శలు గుప్పించారు.
జగన్కు దమ్ముంటే తెరాసకు పోటీ చేయాలి
కాంగ్రెస్తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తు కోసం ప్రయత్నిస్తుందన్న వ్యాఖ్యలపై రఘువీరా స్పందించారు. రఘువీరా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. అందునా వైసీపీలాంటి బ్రోకర్ పార్టీ మద్దతు తమకు అవసరం లేదన్నారు. వైసీపీ దమ్ముంటే ఏపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేయాలన్నారు.
పవన్ కళ్యాణ్ వెంట ఉంటామని చిరు ఫ్యామిలీ
కాగా, జనసేన ఒంటరిగా పోటీ చేస్తున్నందు వల్ల నాగబాబు, రామ్ చరణ్ తేజ, వరుణ్ తేజ వంటి వారిలా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్కు అండగా ఉంటారా లేదా అనే చర్చ సాగుతోంది. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చునని చెబుతున్నారు. గతంలో కర్ణాటకలో బీజేపీ తరఫున పవన్, కాంగ్రెస్ తరఫున చిరంజీవి ప్రచారం చేశారు. కానీ ఏపీలో భిన్న పరిస్థితులు. చిరంజీవి ప్రచారం చేస్తే నేరుగా పవన్ కళ్యాణ్కు దెబ్బ తగులుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చెబుతున్నట్లుగా ప్రచారం చేస్తారా అనే చర్చ సాగుతోంది. అయితే రామ్ చరణ్ తేజ సహా చిరంజీవి కుటుంబ సభ్యులు జనసేనానికి అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రచారానికి దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
అదే జరిగితే పవన్ కళ్యాణ్కు దెబ్బే
నిజంగానే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే.. జనసేనకు పెద్ద దెబ్బే. ఎందుకంటే చిరంజీవి కుటుంబానికి చెందిన ఫ్యాన్స్ ఇప్పటికే జనసేన వైపు ఉన్నారు. చిరంజీవి కాంగ్రెస్కు ప్రచారం చేస్తే అభిమానుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, కాబట్టి చిరంజీవి మౌనంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అలాగే ఓట్లు చీలి జనసేనకు నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. లేదా ఇప్పటికే చిరంజీవి అభిమానులంతా జనసేనలో చేరారు. ఈ నేపథ్యంలో అభిమానుల్లో గందరగోళం క్రియేట్ చేయడం, ఓట్లు చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చ సాగుతోంది.