గంటాకు 'చిరు' షాక్, ప్రజారాజ్యం మైనస్ కానుందా?
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావుకు 'చిరు' షాక్ తగలనుందా? కావొచ్చునని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబు... కాపులకు ఒకటి, బిసిలకు ఒకటి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాపు, బిసిలకు ఆ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. బిసిలలో ఎక్కువగా పోటీ లేదు. కాపు సామాజిక వర్గంలోనే ఎక్కువగా పోటీ ఉంది. కాపు ఉప ముఖ్యమంత్రి రేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా ఉన్నారు. గంటా, కళా వెంకట్రావు తదితర సీనియర్ నేతలు ఉన్నారు.
అయితే వీరు గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లడం మైనస్గా మారిందంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన టిడిపి నేత దేవేందర్ గౌడ్ అంతకుముందు టిడిపిలో ఉన్నప్పుడు చంద్రబాబు తర్వాతి స్థానం.. నెంబర్ టూలో ఉండేవారు. అతను పార్టీని వీడి నవ తెలంగాణ పార్టీ స్థాపించడం, ఆ తర్వాత పిఆర్పీలో చేరడం, అటు తర్వాత తిరిగి టిడిపికి గూటికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన స్థానం ఏమిటో కూడా తెలియని పరిస్థితి ఉంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గంటాకు అదే పరిస్థితి అంటున్నారు. గతంలో ఆయన పార్టీలో కీలకంగా ఉండేవారు. అలాగే కొనసాగితే.. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమయ్యేదని చెబుతున్నారు. పిఆర్పీలోకి వెళ్లడం ఆయనకు మైనస్ కానుందని చెబుతున్నారు. అయితే గంటా మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని భావిస్తున్నారు.