చంద్రబాబుకు సలహా ఇచ్చింది చిట్టి నాయుడే అంటూ చంద్రబాబును ఏకిపారేసిన వైసీపీ ఎంపీ
ఏపీలో మూడు రాజధానుల రగడ తారాస్థాయికి చేరింది. ఇక ఈ సమయంలో కూడా చంద్రబాబును వదలకుండా విజయ సాయి రెడ్డి మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించే విజయసాయి రెడ్డి తాజాగా చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరించటంపై వరుసగా విమర్శలు చేస్తూ ఆ సలహా ఇచ్చింది చిట్టి నాయుడే అంటూ ఆసక్తికర ట్వీట్స్ చేశారు .ఇందులో నారా లోకేష్ ను సైతం టార్గెట్ చేశారు .
చంద్రబాబు జోలె పట్టటంపై సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి
ఏపీ రాజధాని అమరావతినే కొనసాగించాలని అటు రాజధాని రైతులతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ మొదట నుండి ఏపీ రాజధాని అమరావతినే అని తమ స్టాండ్ వినిపిస్తుంది. ఇక ఇదే క్రమంలో జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఏపీలో టీడీపీ ఆందోళనలు ఉధృతం చేసింది . వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులకు బాసటగా పోరాటం సాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరిస్తున్నారు.ఇక ఈ నేపధ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు చంద్రబాబు విరాళాల సేకరణపై సెటైర్లు వేశారు.
చంద్రబాబు నాయుడు ముఖ్య సలహాదారు చిట్టి నాయుడే అంటూ వ్యంగ్యాస్త్రాలు
చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరిస్తున్న తీరుపై విజయసాయి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. మొన్నటికి మొన్న గంటల వ్యవధిలో కోట్ల రూపాయలు పోగు చేయగల స్తోమత ఉన్న వాళ్లు, జనాల ముందు జోలె పట్టి విరాళాలు అడగటం దేనికన్న విజయసాయి తాజాగా చేసిన ట్వీట్ లో చంద్రబాబు నాయుడు ముఖ్య సలహాదారు చిట్టి నాయుడే అయి ఉంటాడని అనుకుంటున్నారంతా అని వ్యంగ్యంగా మాట్లాడారు.
గాజులు, ఉంగరాల సేకరణ నుంచి జోలె పట్టుకునే దాకా అంటూ సెటైర్లు
గాజులు, ఉంగరాల సేకరణ నుంచి జోలె పట్టుకునే దాకా ‘రాజు గారి దేవతా వస్త్రాల' కథ గుర్తు కొస్తోంది. తుఫాన్లతో వేల కోట్ల నష్టం వాటిల్లినప్పుడు సైతం చేతులు చాపని వ్యక్తి ఇంతగా రగిలి పోవడం అలాగే అనిపించట్లేదూ? అంటూ ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు విజయసాయి రెడ్డి .మొన్న చంద్రబాబు బినామీల ఆస్తులు లక్ష కోట్లకు పై మాటే మళ్ళీ ఈ జోలె దానికి బాబు అంటూ నిప్పులు చెరిగారు. మొత్తానికి చంద్రబాబు విరాళాల సేకరణపై విరుచుకుపడ్డారు విజయసాయి.
ప్రజా ధనాన్ని తన సొత్తుగా అడ్డగోలుగా లూటీ చేసే బాబు అంటూ ఫైర్
అంతేకాదు మరో ట్వీట్ లో చంద్రబాబు నాయుడు స్వభావం మొదటి నుంచి అంతే అంటూ విమర్శలు గుప్పించారు . ప్రజా ధనాన్ని తన సొత్తు అన్నట్టుగా అడ్డగోలుగా లూటీ చేస్తాడు అని విజయసాయి పేర్కొన్నారు . అడ్డం తన్నగానే తన బాధ ప్రజల బాధగా చిత్రీకరిస్తాడు అంటూ మండిపడ్డారు . ఎల్లో మీడియా మోత మోగించే రోజుల్లో అయితే ఆడింది ఆటగా సాగేది? సోషల్ మీడియా సూర్యుడు పొడిచాక చీకటి చుక్కలు అదృశ్యమయ్యాయి అంటూ విజయసాయి చంద్రబాబుపై మాటల దాడి చేశారు.