మేయర్ అనురాధ హత్య: సహకరించిన చింటూ, అతని కీలక పాత్ర!
చిత్తూరు: మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో మురుగ కీలక పాత్ర పోషించాడని పోలీసులు చెబుతున్నారు. హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. చింటూకు సహాయకులైన పరంధామ, మురుగ, హరిదాస్లను అరెస్టు చేశారు.
పరంధామ, హరిదాస్లు గతంలో మేయర్ అనురాధ భర్త మోహన్ వద్ద పని చేశారు. ఆ తర్వాత చింటూ వద్దకు వచ్చారు. పరంధామ చింటూ వ్యాపార లావాదేవీలను చూసుకుంటూ బినామీగా ఉన్నాడు. అతనిపై కొన్ని బ్యాంకు ఖాతాలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.
హరిదాస్ మార్కెట్ వ్యవహారాలు చూసుకునే వాడని సమాచారం. హత్య ఘటనపై చింటూ కార్యాలయంలో తరచూ మాట్లాడుకునేవారు. 47వ డివిజన్ కార్పొరేట్ భర్త మురుగా ఈ జంట హత్య కేసులో కీలక పాత్ర పోషించాడని చెబుతున్నారు.
ఎన్నికల సమయంలో మోహన్... మురుగాకు కాకుండా మరో వ్యక్తికి సహకరించారని, తన భార్యకు కూడా సీటు తెచ్చుకున్నాడు. పలు పనుల్లోను అడ్డుపడ్డాడు. అయితే చింటూ.. మురుగకు సహకరిస్తూ వచ్చాడు. దీంతో మురుగ... చింటూతో కలిసిపోయాడు.
హత్య చేయడానికి బురఖాలు, కూరగాయల సంచి, మహిళల చేతిసంచి మురుగనే కొనిచ్చాడని తెలుస్తోంది. హత్య జరిగిన రోజు మురుగా... చింటూతోపాటే ఉంటూ సెల్ఫోన్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న ఓ కుర్రాడి ద్వారా సమాచారం కనుక్కున్నాడు.
ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న చింటూకు సంబంధించిన 21 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. అతనికి స్థానికంగానే కాకుండా, విదేశాల నుంచి కూడా నగదు వచ్చిందని, వాటిని కూడా పరిశీలిస్తున్నారు. చింటూ రెండు రోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.