మేయర్ హత్య, కార్పోరేటర్ ఇంట్లో సోదాలు: డిగ్రీ కాలేజ్ కొన్న చింటూ, పీఏ బినామీ!
చిత్తూరు: మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో చింటూ అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. సంతపేటలో ఓ మహిళా కార్పోరేటర్ భర్త మురుగ ఇంట్లో పోలీసులు సోమవారం నాడు తనిఖీలు నిర్వహించారు. మేయర్ దంపతుల హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తును వేగవంతం చేస్తున్నారు.
చింటూతో ఆర్థిక లావాదేవీలు ఉన్న వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలాగే ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చింటూకు కర్నాటకలోను ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చింటూ ఆస్తులను సీజ్ చేసిన విషయం తెలిసిందే.
పరారీలో ఆరుగురు
పోలీసులు పలువురికి నోటీసులు ఇచ్చారు. ఆరుగురు నోటీసులు స్వీకరించగా, మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మురుగ అనే వ్యక్తి చింటూకు అనుచరుడు. మురుగ భార్య కార్పోరేటర్. వారి నివాసంలో జరిపిన సోదాల్లో పోలీసులు కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
పరంధామ అనే చింటూ అనుచరుడి నివాసంలోను కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కొందరి నివాసాల్లో ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
డిగ్రీ కాలేజీ కొన్న చింటూ, క్వారీ విషయమై వివాదం
మేయర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల అతను ఓ డిగ్రీ కళాశాలను కూడా కొనుగోలు చేశాడని తెలుస్తోంది. అందుకు అతనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని పోలీసులు ఆరా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మేయర్ దంపతులతో క్వారీ విషయంలో కూడా చింటూకు గొడవ వచ్చినట్లుగా సమాచారం.
పోలీసులు నాలుగు రోజులుగా కొంతమంది ఇళ్లల్లో సోదాలు చేపడుతున్నారు. చింటూకు సన్నిహితంగా ఉంటూ, కొన్ని వ్యాపారాల లావాదేవీలను చూసే కొంతమందిని గుర్తించి, వారి ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు.
చిత్తూరు రెండో పట్టణ సీఐ సూర్యమోహనరావు ఆదివారం తన సిబ్బందితో కలసి చింటూ పీఏగా ఉన్న పరంధామ ఇంట్లో సోదాలు చేపట్టి కొన్ని కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ ల్యాప్టాప్, 3 హార్డ్ డిస్క్లు, పెన్డ్రైవ్లు, కొన్ని విలువైన దస్త్రాలు ఉన్నాయి.
యాదమరిలో చింటూకు సంబంధించి క్వారీలో కూడా పోలీసులు సోదాలు చేపట్టారు. అక్కడ ఉన్న కొన్ని దస్త్రాలను స్వాధీనం చేసుకుని, క్వారీకి సంబంధించిన వాహనాలు, యంత్రాలను సీజ్ చేశారు. చిత్తూరు నగరం మురకంబట్టులోని మద్యం దుకాణాన్ని కూడా పోలీసు అధికారులు సీజ్ చేశారు.
వాటితో పాటు ఇతర ఆస్తులు ఉన్నాయా అనే విషయమై ఆరా తీస్తున్నారు. ఇందుకు ఓ ప్రత్యేక బృందం విస్తృతంగా గాలిస్తోంది. చిత్తూరు నగరం గంగనపల్లెలో నివాసం ఉంటున్న పరంధామ... చింటూకు బినామీగా ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు.
చింటూకు పీఏగా ఉంటూ బినామీ!
ఆయన చింటూకు సన్నిహితంగా ఉంటూ పీఏగా వ్యవహరిస్తున్నట్లు తెలిసినా, బినామీ అనే విషయాన్ని పోలీసులు కొత్తగా రాబట్టారు. ఆదివారం పరంధామ ఇంట్లో సోదాలు చేపట్టగా కొన్ని ముఖ్యమైన దస్త్రాలను చూసి విస్తుపోయారు. చింటూకు సంబంధించిన ఆస్తుల వివరాలు ఉండగా, పరంధామకు చెందిన ఆస్తుల వివరాలు కూడా బయటపడ్డాయి.
భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఉండడంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చింటూకు చిత్తూరు నగరంలోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాలు, కర్ణాటక రాష్ట్రంలో కూడా ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
చిత్తూరు పరిసర ప్రాంతం, యాదమరిలో గ్రానెట్ క్వారీలు, బంగారుపాళ్యంలో మ్యాంగో గార్డెన్, చిత్తూరులో రెండు స్థలాలు, మూడు ఇళ్లు, మద్యం వ్యాపారం, కళాశాల, కర్ణాటక రాష్ట్రంలోని ములబాగల్లో మ్యాంగో గార్డెన్, ఇంటి స్థలాలు, ఇలా మరికొన్ని ఆస్తులను గుర్తించారు. ఇలాంటి ఆస్తులు కొన్ని పరంధామ పేరుపై కూడా ఉన్నట్లు పోలీసు అధికారులు వివరించారు.