అనురాధ హత్యలో కీలక సమాచారం, బిగుస్తున్న ఉచ్చు: చింటూనే కాల్చాడు, ఆఫీస్లోనే సాయం?
చిత్తూరు: మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. మేయర్ అనురాధను కాల్చి చంపింది చింటూనే అని పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితులు విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
నిందితులుగా భావిస్తున్న చింటూ, వెంకటాచలపతి, జయప్రకాశ్, మంజు, వెంకటేష్లు తుపాకీతో బెదిరించి కార్యాలయంలోకి వెళ్లారని, లోనికి వెళ్లిన చింటూ మేయర్ నుదుటి పైన కాల్పులు జరిపాడని విచారణలో వెల్లడించారని తెలుస్తోంది. మోహన్ తప్పించుకొని బయటకు పరిగెత్తగా, అతని మెడ పైన కత్తితో దాడి చేశారు.
తమ టార్గెట్లో ఉన్న మిగిలిన వారి కోసం కూడా వారు ప్రయత్నం చేశారు. కుదరక పోవడంతో కత్తిని వదిలేసి వెళ్లిపోయారు. నిందితుల్లో ముగ్గురు లొంగిపోగా, ఇద్దరు పారిపోయారు. మేయర్ దంపతుల హత్యలో.. చింటూకు ఎవరు సాయం చేశారనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
నగర పాలక సంస్థలోనే కొందరు చింటూకు సాయం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ కార్పొరేటర్ భర్త పాత్ర పైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఘటనకు ముందు రోజు భారీగా డబ్బు చేతులు మారినట్లు కూడా పోలీసులు అంచనాకు వచ్చారని అంటున్నారు.
చింటూ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. వారి నుంచి పోలీసులు అన్ని విషయాలు రాబడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు, మరో వ్యక్తి పాత్ర ఉన్నట్లు పోలీసులకు ప్రాథమికంగా ఆధారాలు దొరికినట్లుగా తెలుస్తోంది.
చింటూ ఆచూకీ ఇస్తే లక్ష రూపాయల రివార్డు ఇవ్వడంతో పాటు వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ కేసు దర్యాఫ్తు నిమిత్తం ప్రత్యేకంగా నియమించిన అదనపు డిజి ఠాకూర్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
హత్యకు సంబంధించి పాత్రధారులపై స్పష్టత వచ్చిందని, సూత్రధారి ఎవరనే దానిపై దృష్టిసారించామన్నారు. చింటూను పట్టుకోవడానికి పది బృందాలు గాలిస్తున్నట్లు చెప్పారు. చింటూ, అతని అనుచరుల బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ చెప్పారు.
చింటూ, అనుచరుల ఇళ్లలో కీలక సమాచారం దొరికిందని తెలిపారు. చింటూ కార్యాలయం, ఇంటికి సంబంధించిన సీసీ కెమెరాలదృశ్యాల డీడీఆర్ లభ్యమైందన్నారు. మేయర్ కుటుంబ సభ్యులు, బంధువులను నాలుగు గంటలపాటు విచారించినట్లు చెప్పారు.
కాగా, మేయర్ దంపతుల హత్యలకు వాడిన తుపాకీని నిందితులు అనంతపురంలో కొనుగోలు చేశారనే విషయానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని అనంత ఎస్పీ రాజశేఖర్ బాబు చెప్పారు. అసాంఘీక శక్తుల పైన ఉక్కుపాదం మోపుతామన్నారు.