సత్య హరిశ్చంద్రుడి గెటప్లో శివప్రసాద్: వారణాసి నుంచి గెలిచి.. ఇలా చేస్తావా మోడీ?
న్యూఢిల్లీ: రోజుకో అవతారంలో పార్లమెంటు ఎదుట నిరసన తెలియజేస్తున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నేడు సత్య హరిశ్చంద్రుడి అవతారమెత్తారు. సత్య హరిశ్చంద్రుడి గెటప్లో పార్లమెంటుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
సత్యహరిశ్చంద్రుడి లాంటి మహానీయుడు పుట్టిన గడ్డ మీద నుంచి ఎంపీగా పోటీ చేసి.. ఇచ్చిన మాట ఎలా తప్పుతారంటూ ప్రధాని మోడీని శివప్రసాద్ నిలదీశారు. 'సత్యహరిశ్చంద్రుని పాఠం వినలేదా? సత్యహరిశ్చంద్రుడి చరిత్ర కనలేదా? మాట మీద నిలబడాలి కదా.' అని ప్రశ్నించారు.
ప్రధాని పొజిషన్లో ఉన్నవాళ్లు జనాలకు ఆదర్శంగా ఉండాలి కదా.. అని చెప్పుకొచ్చారు. 'ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలపై వాగ్దానాలను నిలబెట్టుకోకుండా.. నిధులు సక్రమంగా ఇవ్వకుండా.. చంద్రబాబు ఎలా సహకరిస్తారు?' అని ప్రశ్నించారు.
'దశావతారం'ని మించిపోయాడే?: వెండితెర మీద కమల్.. పొలిటికల్ తెర మీద శివప్రసాద్
అందుకే గంగానదిని.. వారణాసిని, సత్యహరిశ్చంద్రుడిని, మోడీ గారిని కలిపానని అన్నారు. 'దేశ ప్రజలలో చాలామంది ఒక్కసారైనా.. వారణాసిని చూడాలనుకుంటారు. అక్కడున్న గంగానదిలో పవిత్ర స్నానం చేసి జన్మను సార్థకం చేసుకోవాలని కోరుకుంటారు.
అలాగే వారణాసికి సంబంధించిన చరిత్రకారుడు మాట మీద నిలబడి భార్యను అమ్ముకుని.. సత్యవాక్కు పరిపాలన కోసమే కష్టాలెన్ని ఉన్నా ఓర్చుకుని నిలబడ్డాడు' అని వారణాసి గడ్డ గొప్పతనాన్ని గుర్తుచేశారు. అలాంటి వారణాసి నుంచి ఎంపీగా నిలబడి ప్రధాని అయిన మోడీ ఎందుకు మాట తప్పుతున్నారని ప్రశ్నించారు.