వణుకు పుట్టిస్తోన్న 'పార్థీ' గ్యాంగ్: పోలీసుల అలర్ట్, వీళ్లు మహా డేంజర్..
చిత్తూరు: ఏపీలో పార్థీ గ్యాంగ్ సంచరిస్తుందన్న వార్త ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దేశంలోని అత్యంత నేరపూరిత గ్యాంగుల్లో ఒకటైన ఈ గ్యాంగ్.. ప్రస్తుతం చిత్తూరు-నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో సంచరిస్తోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే జిల్లా వ్యాప్తంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు పోలీసులు.
పార్థీ గ్యాంగ్ కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అనుమానం ఉన్న ప్రతీచోట తనిఖీలు చేయాలని, ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్స్, జాతీయ రహదారులు, శివారు ప్రాంతాల వెంబడి తనిఖీలు చేయాలని జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ పోలీసులను ఆదేశించారు. ఈ గ్యాంగ్ పోలీసులపై కూడా దాడులకు తెగబడే అవకాశం ఉండటంతో.. 'షూట్ ఎట్ సైట్'(కనిపిస్తే కాల్చిపారేయడం) ఆదేశాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.
కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 18పార్థీ గ్యాంగులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది మహారాష్ట్రలోని చత్రీ, పర్బాని, నాసిక్, ఇంజన్ఘాట్, గుల్బర్గా, బాంబే, ఔరంగాబాధ్, మధ్యప్రదేశ్, భూపాల్ తదితర ప్రాంతాలకు చెందినవారే. నిజానికి వీరంతా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పాసే పార్థీ తెగకి చెందినవారని, బతుకుదెరువు కోసం వలస వెళ్లిన నగరాలు, పట్టణాల్లో దొంగలుగా మారారని చెబుతారు.
నగరాలు, పట్టణాల్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జిలే వీరికి షెల్టర్. వాటి కింద గుడారాలు వేసుకుని ఉంటారు. లేదంటే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ల సమీపంలో చిన్న చిన్న గుడారాలు వేసుకుని బతుకుతుంటారు. పగలంతా చెత్త ఏరుకోవడం, పిన్నీసులు, పూసలు అమ్మడం, లేదా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అడుక్కోవడం చేస్తుంటారు. ఇదే క్రమంలో దొంగతనాలకు అనువుగా ఉండే ఇళ్లను రెక్కీ చేస్తారు.
రాత్రివేళల్లో ఒంటికి ఒండ్రుమట్టి, నూనె రాసుకుని చోరీలు, దోపిడీలకి పాల్పడుతుంటారు. ఆ క్రమంలో ఇంట్లోవాళ్లు ఎవరైనా తిరగబడితే.. నిర్దాక్షిణ్యంగా వారిని హత్య చేస్తారు. ఇందుకోసం కత్తులు, బ్లేడులు, ఇనుప కడ్డీలు, తుపాకులు వెంటే తీసుకెళ్తారు. 1999వ సంవత్సరం నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో పలు దోపిడీలు, చోరీలకి పాల్పడ్డారు.
ప్రజలు భయపడాల్సిన పనేమి లేదని కానీ అనుమానస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్టు అనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.