పదేళ్లకే పేకాట.. లక్షలు పోగేసి, ఉన్నదంతా పోగొట్టుకుని.. అవయవాలు అమ్ముతానంటూ..!
మదనపల్లె : పేకాటకు బానిసయ్యాడు. జూదం ఆడటం తప్ప మరో పని లేకుండా తయారయ్యాడు. పదేళ్ల వయస్సులోనే ముక్కలాట నేర్చుకున్నాడు. యుక్తవయసు వచ్చేసరికి బాషా అయ్యాడు. జాకీ, రాణి అంటూ ఏ పేక ముక్కైనా చూడకుండా చెప్పే రేంజ్కు ఎదిగాడు. ఎవరితో ఆడినా ఆట మాత్రం అతడిదే. అంతలా జూదంలో కింగ్లా మారాడు. లక్షల రూపాయలు కూడబెట్టాడు. చివరకు అదే వ్యసనం కారణంగా ఉన్నదంతా పొగొట్టుకున్నాడు. చివరకు తాను వెళుతున్న దారి మంచిది కాదనుకున్నాడు. ఆ క్రమంలో జిల్లా అధికారులను కలిసి అవయవాలు అమ్ముకునేలా అనుమతి ఇవ్వండని వేడుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో చర్చానీయాంశంగా మారిన ఈ విచిత్ర వింత గాథ చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
చిన్నతనంలోనే పేకాటకు బానిస
చిత్తూరు జిల్లా కురబలకోట మండల కేంద్రానికి చెందిన కౌమద్ది రహ్మతుల్లా కొడుకు బావ్జి చిన్నతనంలోనే పేకాటకు అలవాటు పడ్డాడు. దాదాపు పదేళ్ల వయసులోనే పేకాట నేర్చుకున్నాడు. అలా క్రమక్రమంగా దానికి బానిసయ్యాడు. అంతేకాదు ముక్కలాటలో కింగ్ అయ్యాడు. చిన్నప్పటి నుంచే ఆ వ్యసనానికి బానిస కావడంతో పేకాటలో తోపయ్యాడు. ఎదుటి వారి చేతిలో ఏ ముక్కలున్నాయో చెప్పేంతలా ప్రావీణ్యం సంపాదించాడు. అదే ధ్యాస తప్ప మరో పని తెలియకుండా పెరిగాడు. అయితే పదిమందిని మోసం చేసి పేకాటలో లక్షల రూపాయలు సంపాదించానని.. ఇప్పుడు మాత్రం చేతిలో రూపాయి లేదని.. ఆ క్రమంలో తన అవయవాలు అమ్ముకునేలా పర్మిషన్ ఇవ్వాలంటూ జిల్లా అధికారులను కలవడం హాట్ టాపికైంది.
ఇద్దరి ప్రియుల మధ్య నలిగిన కీర్తి.. కన్నతల్లి హత్య కేసులో సంచలన నిజాలు..!
పేకాటలో ఆరితేరి.. ఏ ముక్కేదో ఇట్టే చెప్పేసి
పేకాటలో లక్షలు సంపాదించిన రోజులున్నాయని చెప్పే 24 ఏళ్ల బావ్జి ఇప్పుడంతా కోల్పోయానని బాధ పడుతున్నాడు. పేకాటలో సంపాదించిన డబ్బులతో ఒక చెల్లి పెళ్లి చేశానని.. ఇంకా ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి చేయాల్సి ఉందంటున్నాడు. అందుకే చేతిలో చిల్లిగవ్వ లేక అవయవాలు అమ్మి మిగతా ఇద్దరి చెల్లెళ్ల పెళ్లి చేద్దామని డిసైడ్ అయినట్లు చెప్పుకొచ్చాడు. ఆ క్రమంలో స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ను కలిసి పూర్తి కథ వినిపించాడు. తనకు తెలిసిన మూడు ముక్కలాటను ప్రదర్శించి అబ్బురపరిచాడు.
ఎంతోమందిని మోసం చేసి లక్షలు కూడబెట్టానంటూ..!
ఇదివరకు పేకాటలో ఎంతో మందిని మోసం చేసి లక్షలు కూడబెట్టానని.. కానీ చివరకు తన దగ్గర రూపాయి మిగల్లేదని ఆవేదన చెందాడు. అందుకే ఆ దారి మంచిది కాదని నిర్ణయించుకుని ఇకపై పేకాటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఇకపై ఎవర్నీ మోసం చేయబోనంటూ సబ్ కలెక్టర్కు వివరించాడు. పేకాట అనేది తనకు వ్యసనంలా మారిందని.. అందులో ఎంత డబ్బు సంపాదించినప్పటికీ సమాజంలో విలువ లేదని చెప్పుకొచ్చాడు. అందుకే అలాంటి జీవితానికి స్వస్తి పలికి కొత్త జీవితం ప్రారంభించాలని డిసైడ్ అయినట్లు చెప్పాడు.
ఇకపై అలాంటి జీవితం వద్దని.. అవయవాలు అమ్ముకుంటానంటూ..!
పేకాటలో తాను సంపాదించడమే గాకుండా ఎందరికో లక్షలాది రూపాయల ఆదాయం చూపించినట్లు తెలిపాడు. అయితే తాను ఎంత సంపాదించినా.. మనశ్శాంతి లేకుండా పోయిందని.. ఇప్పుడేమో రూపాయి లేకుండా మిగిలిపోయానని వాపోయాడు. అందుకే అలాంటి జీవితం వ్యర్థం అనుకుని ఇంకా ఇద్దరి చెల్లెళ్ల పెళ్లి చేయాల్సిన బాధ్యత తనపై ఉండటంతో అవయవాలు అమ్ముకోవాలని డిసైడ్ అయినట్లు తెలిపాడు. అయితే ఆ యువకుడు చెప్పేదంతా సావధానంగా విన్న సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి అతడి తల్లిదండ్రులను తీసుకు రావాల్సిందిగా ఎమ్మార్వోను ఆదేశించారు.
ఉద్యోగాల పేరిట వల విసిరి.. లక్షల రూపాయలు కాజేసి.. దుబాయికి పరార్..!
కౌన్సెలింగ్ నిర్వహించి మానసిక స్థితిపై విచారిస్తామంటూ..!
సబ్ కలెక్టర్ ఆదేశాలతో బావ్జి తండ్రి రహ్మతుల్లాను అక్కడకు తీసుకొచ్చారు. ఆ క్రమంలో బావ్జి చెప్పిన స్టోరీ అంతా కూడా సబ్ కలెక్టర్ అతడికి వివరించారు. దానికి ఆయన కూడా నిజమేనని ఒప్పుకున్నారు. తన కొడుకు చాలా తెలివైనవాడని, పేకాటకు వ్యసనపరుడై డబ్బు సంపాదించింది నిజమేనని ఒప్పుకున్నారు. అయితే ఎంత సంపాదించాడో అదంతా కూడా పేకాటలోనే పోగొట్టేశాడని వివరించారు. మరి మీ కొడుకు అవయవాలు అమ్ముకుంటానని అనుమతి అడుగుతున్నాడని చెబితే.. అదేమీ లేదంటూ కొడుకును అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. అయితే బావ్జి మానసిక స్థితిపై పూర్తిస్థాయిలో విచారించడంతో పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు సబ్ కలెక్టర్.